ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్తో సినీ ఇండస్ట్రీ ఉలిక్కి పడగా, ఇప్పుడు రెబల్ స్టార్ కృష్ణం రాజుకి ప్రమాదం జరిగిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. వివరాలలోకి వెళితే సోమవారం సాయంత్రం కృష్ణం రాజు తన ఇంట్లో ప్రమాదవశాత్తు కాలుజారి క్రింద పడ్డారట. దీంతో ఆయన తుంటికి ఫ్రాక్చర్ అయినట్టు సమాచారం.
కృష్ణంరాజుకి అపోలోలో చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తుండగా, అపోలో వైద్యులు మంగళవారం ఉదయం తుంటికి శస్త్రచికిత్స చేశారని.. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని చెప్పుకొస్తున్నారు. అయితే ఆయన కార్యాలయం వర్గాలు మరో వాదన వినిపిస్తున్నాయి. కృష్ణంరాజు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని.. కేవలం రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం అపోలోకి వచ్చినట్లు చెబుతున్నారు.
త్వరలో ఆయన యూకేకి వెళ్లాల్సి ఉన్నందున రొటీన్ హెల్త్ చెకప్ చేసుకోవడానికి అపోలోకి వచ్చినట్లు కృష్ణంరాజు కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు న్యుమోనియాతో కృష్ణంరాజు బాధపడుతుంగా, ఆయనకు అపోలోలో చికిత్స అందిస్తున్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయనని అబ్జర్వేషన్లో ఉంచారని, 48 గంటల తర్వాత ఆయన ఆరోగ్యంకు సంబంధించి పూర్తి క్లారిటీ వస్తుందని అంటున్నారు. దీంతో అభిమానులలో సందిగ్ధత ఏర్పడింది. ఏది నిజమో తెలియక తర్జన భర్జన పడుతున్నారు. 81 ఏళ్ల కృష్ణం రాజు చివరిగా రాధే శ్యామ్ చిత్రంలో కీలక పాత్ర పోషించారు.