‘పదో తరగతి కలిసి చదువుకున్న కొందరు స్నేహితుల కలలు నెరవేరాయా?చాలా ఏళ్ల తర్వాత తిరిగి వారందరూ ఏ విధంగా కలుసుకున్నారనేది తెలియాలంటే డిసెంబర్ వరకు ఆగాల్సిందే’ అంటున్నారు ఛాయాగ్రాహకుడు ‘గరుడవేగ’ అంజి. ఆయన దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అవికాగోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. అచ్యుతరామారావు, పి.రవితేజమన్యం నిర్మిస్తున్నారు. ఫస్ట్లుక్ను బుధవారం దర్శకుడు క్రిష్ విడుదలచేశారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ‘ప్రతి ఒక్కరికి పదో తరగతి జ్ఞాపకాల్ని గుర్తుకుతెచ్చే చిత్రమిది. స్నేహం, ప్రేమ, కలలు, జీవితలక్ష్యాలతో ముడిపడి సాగుతుంది’ అన్నారు. పదో తరగతి కలిసి చదువుకున్న కొందరు స్నేహితుల కథ ఇదని, అవికాగోర్, శ్రీరామ్ పాత్రలు గుర్తుండిపోతాయని, నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తిచేసి డిసెంబర్లో సినిమాను విడుదలచేస్తామని నిర్మాతలు పేర్కొన్నారు. శ్రీనివాసరెడ్డి, వెన్నెల రామారావు, అర్చన, మధుమిత, శివబాలాజీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సురేష్ బొబ్బిలి.