Ilaiyaraaja | ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె, గాయని భవతరణి (47) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె.. గురువారం తుది శ్వాస విడిచారు.
కొంతకాలంగా లివర్ క్యాన్సర్తో బాధపడుతున్న భవతరణికి శ్రీలంకలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ఆమె మరణించినట్లు సమాచారం. భవతరణి భౌతికకాయాన్ని రేపటిలోగా చెన్నైకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. చెన్నైలోనే ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇళయారాజా కూతురు మరణ వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
ఇళయరాజా కూతురు భవతరిణికి గాయనిగా కోలీవుడ్లో మంచి గుర్తింపు ఉంది. 2000 సంవత్సరంలో వచ్చిన భారతి అనే సినిమాకు ఇళయరాజా సంగీతం అందించాడు. ఆ సినిమాలో మాయిల్ పోలా పొన్ను ఒన్ను అనే పాటను భవతరిణి పాడింది. ఈ పాటతో ఆమె నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. ఆ తర్వాత పలు సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్గానూ పనిచేసింది. చివరగా 2019లో వచ్చిన మాయానది అనే తమిళ చిత్రానికి సంగీత దర్శకురాలిగా పనిచేసింది.