K Bhagyaraj | తమిళ సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణవార్త మరువకముందే, ఆయన ప్రియ శిష్యుడు, ప్రముఖ నటుడు, దర్శక-రచయిత కె. భాగ్యరాజ్ (73) కన్నుమూశారు. శనివారం (జూన్ 27) తన నివాసంలో గుండెపోటుకు గురైన ఆయనను హుటాహుటిన చెన్నై గ్రీమ్స్ రోడ్లోని అపోలో ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధృవీకరించారు. సరిగ్గా పదిహేను రోజుల క్రితం (జూన్ 10న) భాగ్యరాజ్ గురువు, ప్రముఖ దర్శకుడు భారతీరాజా వయోభారంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆ విషాదం నుంచి తమిళ చిత్ర పరిశ్రమ ఇంకా కోలుకోకముందే, ఇప్పుడు భాగ్యరాజ్ కూడా ఆకస్మికంగా మరణించడం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
1953 జనవరి 7న ఈరోడ్ జిల్లాలో జన్మించిన భాగ్యరాజ్.. తన సినీ ప్రయాణాన్ని భారతీరాజా వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా, రచయితగా ప్రారంభించారు. సామాన్య ప్రజల జీవితాలను, సున్నితమైన హాస్యాన్ని తన సినిమాల్లో అద్భుతంగా ఆవిష్కరించి తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఇక ఆయన పకడ్బందీ కథనాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో.. కోలీవుడ్లో ఆయన్ని “స్క్రీన్ప్లే కింగ్” అని పిలిచేవారు. ఇక తన కెరీర్లో 75కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన, 25కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. ‘ముందానై ముడిచు’ (1983) చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును కూడా అందుకున్నారు. ఇక తెలుగు ఇండస్ట్రీతో కూడా అతడికి విడదీయని అనుబంధం ఉంది. పలు తెలుగు సినిమాలలో నటించిన ఆయన వెంకటేశ్ నటించిన అబ్బాయిగారు (1993) సినిమాకు కథను అందించాడు. ఇక భాగ్యరాజ్ మృతి పట్ల కోలీవుడ్తో పాటు టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన లేని లోటు ఎప్పటికీ తీర్చలేనిదని నివాళులర్పిస్తున్నారు.