కోలీవుడ్ హీరో సూర్య నటిస్తున్న కొత్త చిత్రం రెగ్యులర్ చిత్రీకరణకు సిద్ధమవుతున్నది. సూర్యకిది 42వ సినిమా. సిరుతై శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా సూర్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో నిర్మితం కానుందని సమాచారం. ఈ చిత్రంలో ఆయన సరసన నాయికగా దిశా పటానీ ఎంపికైనట్లు తెలుస్తున్నది.
ఈ సినిమాతో ఆమె తమిళ చిత్ర పరిశ్రమలో అరంగేట్రం చేస్తున్నది. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్ ఉంటాడని ముందు అనుకున్నా…అతని స్థానంలో దేవి శ్రీప్రసాద్ను ఎంపికచేశారట. సూర్య, దేవి కాంబినేషన్లో పలు సూపర్హిట్ ఆల్బమ్స్ వచ్చాయి.
చాలా విరామం తర్వాత వీరిద్దరు కలిసి సినిమాకు పనిచేస్తున్నారు. ప్రస్తుతం సూర్య ‘వాడివాసల్’, ‘వనంగన్’ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. మరోవైపు సూర్య నటించిన ‘జైభీమ్’ సినిమా మరో ఘనతను అందుకుంది. ప్రస్తుతం జరుగుతున్న బీజింగ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శనకు ఎంపికైంది. ఈ సినిమాను చూసిన వారంతా గొప్ప చిత్రంగా అభివర్ణించారని ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులు చెబుతున్నారు.