గత ఏడాది ఆమిర్ఖాన్తో వైవాహిక బంధాన్ని తెగతెంపులు చేసుకుంది కిరణ్రావు. విడాకుల అనంతరం కొంతకాలం సినిమా వ్యవహారాలకు దూరంగా ఉన్న ఆమె మరలా దర్శకత్వం వైపు దృష్టి సారించింది. ‘దోభీ ఘాట్’ వంటి సామాజిక ప్రయోజనాత్మక చిత్రం ద్వారా విమర్శకుల ప్రశంసలందుకుంది కిరణ్ రావు. దాదాపు 11 ఏళ్ల విరామం తర్వాత ఆమె తిరిగి మెగాఫోన్ పట్టింది.
‘లాపతా లేడీస్’ పేరుతో కిరణ్ రావు ఓ మహిళా ప్రధాన చిత్రాన్ని తెరకెక్కించింది. నవ వధువులైన ఇద్దరమ్మాయిలు అనుకోకుండా ఓ రైలు ప్రయాణంలో తప్పిపోవడం, వారిని వెతికి పట్టుకోవడానికి చేసే ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుందని తెలిసింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రంలో స్పర్శ్ శ్రీవాస్తవ, రవికృష్ణ, ఛాయా కడమ్ ప్రధాన పాత్రల్లో నటించారని, ఇద్దరు కథానాయికలు కొత్తవారని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రాన్ని ఆమిర్ఖాన్ ప్రొడక్షన్స్ పతాకంపై అమిర్ఖాన్, కిరణ్రావు సంయుక్తంగా నిర్మించారు. ‘లాల్సింగ్ చద్దా’ సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్లలో ఈ నెల 11న ‘లాపతా లేడీస్’ ట్రైలర్ను విడుదల చేయబోతున్నారు.