‘సెబాస్టియన్ పాత్ర వినగానే ఎంతో ఛాలెంజింగ్గా అనిపించింది. ఈ చిత్రంలో రేచీకటితో బాధపడుతున్న యువకుడిగా కనిపిస్తాను. కథ పదిహేను నిమిషాలు వినగానే నచ్చింది. సెబాస్టియన్ పాత్ర అందరికి చాలా కాలం గుర్తుండిపోతుంది’ అన్నారు కథానాయకుడు కిరణ్ అబ్బవరం. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘సెబాస్టియన్ పి.సి.524’, నమ్రతా దారేకర్, కోమలి ప్రసాద్ నాయికలు. బాలాజీ సయ్యపు రెడ్డి దర్శకుడు. ఎలైట్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో జ్యోవిత సినిమాస్ పతాకంపై సిద్ధారెడ్డి నిర్మిస్తున్నారు. చిత్రం ఈ నెల 25న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ‘సెబాస్టియన్ పాత్ర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. పక్కింటి కుర్రాడి కథలా అనిపిస్తుంది.చాలెంజ్గా తీసుకుని చేసిన ఈ పాత్రను ప్రేక్షకుల ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాం. నా కెరీర్లో గుర్తుండిపోయే సినిమాగా ఇది నిలిచిపోతుంది’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘సెబాస్టియన్ అనే కానిస్టేబుల్ తనకున్న రేచీకటి ద్వారా తను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనే కథను ఎంటర్టైన్మెంట్ వేలో చూపిస్తున్నాం. పూర్తి వినోదాత్మక చిత్రంగా ఈ సినిమాను తెరకెక్కించాం. తప్పకుండా చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది’ అని తెలిపారు. హీరో కిరణ్ అబ్బవరం ఎంతో అంకితభావంతో ఈ సినిమా చేశాడు. ఈ చిత్రం ఆయన కెరీర్లో మైలురాయి చిత్రంగా నిలిచిపోతుందని నిర్మాత తెలిపారు. ఈ సమావేశంలో సహ నిర్మాతలు ప్రమోద్ రాజు, జయచంద్రా రెడ్డి, కేఎల్ మదన్లతోపాటు ఎడిటర్ విప్లవ్, డిఓపీ రాజ్.కె.నల్లి తదితరులు పాల్గొన్నారు.