కొత్త ప్రతిభను పరిచయం చేయాలనే దృక్పథంతో హీరో కిరణ్ అబ్బవరం తన కేఏ ప్రొడక్షన్స్ పతాకంపై సుమైనా స్టూడియోస్తో కలిసి నిర్మిస్తున్న వైవిధ్యకథాచిత్రం ‘తిమ్మరాజుపల్లి టీవీ’. సాయితేజ్, వేద జలంధర్ జంటగా నటిస్తున్నారు. వి.మునిరాజు దర్శకుడు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ డ్రామా ఏప్రిల్ 17న థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్లో గ్రాండ్ రివీల్ ఈవెంట్ని నిర్వహించారు. చిత్ర నిర్మాత కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ‘ఈ కథంతా 1995లో జరుగుతుంది. ఇది దర్శకుడు మునిరాజు ఊరికథ.
కథ చెప్పే ముందే తాను రెగ్యులర్ కమర్షియల్ సినిమా చేయాలనుకోవడంలేదనీ, తన ఊరి జనాల ఇన్నోసెన్స్, వారిమధ్య జరిగే డ్రామా, టీవీకి అప్పట్లో ఉన్న ప్రాధాన్యత.. ఈ నేపథ్యంలో సినిమా చేయాలనుకుంటున్నాననీ చెప్పాడు. ఇది హానెస్ట్గా మేమంతా చేసిన ప్రయత్నం. 90 కిడ్స్కు అయితే ఈ సినిమా తెగ నచ్చేస్తుంది. సాంకేతికంగా అన్ని విధాలా సినిమా బావుంటుంది. ఒక మంచి సినిమా నిర్మించినందుకు గర్వంగా ఉంది’ అని అన్నారు. ఇంకా చిత్రబృందమంతా మాట్లాడారు. ప్రదీప్ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్, సత్యనారాయణ, లతీష్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అక్షయ్ రామ పొదిశెట్టి, సంగీతం: వంశీకాంత్ రేఖన.