కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన సినిమా ‘మీటర్’. అతుల్య రవి నాయికగా కనిపించనుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై చిరంజీవి (చెర్రి), హేమలత పెద్దమల్లు నిర్మించారు. రమేష్ కాదూరి దర్శకుడు. ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. హైదరాబాద్లో జరిగిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమంలో హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ…‘మాస్ కమర్షియల్ ప్రేక్షకులు ఎలాంటి కథను ఇష్టపడతారో మా చిత్రంలో అలాంటి కథ ఉంటుంది. నన్ను కొత్తగా తెరపై చూపించే చిత్రమవుతుంది.
ఈ వేసవిలో థియేటర్లో విజిల్స్ వేసి ఆస్వాదించే సినిమా అని చెప్పగలను. ఓ హిట్ సినిమా చేసేందుకు మా టీమ్ అంతా శ్రమించింది. మాతో పాటు తెరపైకి వస్తున్న రవితేజ చిత్రాన్ని కూడా ఆదరించాలని కోరుకుంటున్నా’ అన్నారు. నిర్మాత చెర్రీ మాట్లాడుతూ..‘దర్శకుడు రమేష్ ఆకట్టుకునేలా చిత్రాన్ని మలిచారు. ఓ మంచి సినిమా చేశామని రేపు ప్రేక్షకులు కూడా చెబుతారు.
ఈ చిత్రంతో కిరణ్ అబ్బవరం మరో స్థాయికి వెళ్తారు. థియేటర్లో మా చిత్రాన్ని చూసి ఆదరించండి’ అన్నారు. దర్శకుడు రమేష్ కాదూరి మాట్లాడుతూ…‘ఈ కథలో వినోదం, భావోద్వేగం రెండూ ఉన్నాయి. ఓ కుటుంబ బాధ్యత తీసుకునే వ్యక్తిగా హీరో పాత్ర మీ అందరికీ నచ్చుతుంది. దిలీప్ విజువల్స్, జేవీ సెట్స్, సూర్య డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. సాయి కార్తీక్ మంచి సంగీతాన్ని ఇచ్చారు. థియేటర్లో మీరు పెట్టే టికెట్ ధరకు రెట్టింపు వినోదాన్ని పొందుతారు’ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకులు బుచ్చిబాబు, గోపీచంద్ మలినేని, నిర్మాత నవీన్ యెర్నేని, నాయిక అతుల్య రవి, నటుడు సప్తగిరి తదితరులు పాల్గొన్నారు.