కిరణ్ అబ్బవరం, అతుల్య రవి జంటగా నటించిన సినిమా ‘మీటర్’. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై చిరంజీవి (చెర్రి), హేమలత పెద్దమల్లు నిర్మించారు. రమేష్ కాదూరి దర్శకత్వం వహించారు. ఈ నెల 7న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు తెలిపారు నిర్మాత చెర్రీ. ఆయన మాట్లాడుతూ…‘30 ఏండ్లుగా చిత్ర పరిశ్రమలో ఉన్నాను. ‘మనీ’, ‘గులాబీ’, ‘రంగీలా’, ‘యమదొంగ’ వంటి చిత్రాలకు పనిచేశాను. ఆ తర్వాత మైత్రీ వాళ్లతో కలిసి ప్రయాణం మొదలుపెట్టాను. మా క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో ఇప్పటివరకు వైవిధ్యమైన చిత్రాలు నిర్మిస్తూ వచ్చాం. గోపీచంద్తో ‘ఒక్కడున్నాడు’. ‘మత్తు వదలరా’, ‘హ్యాపీ బర్త్డే’ వంటి సినిమాలు నిర్మించాం. ఈసారి కమర్షియల్ మూవీ చేయాలని భావించి ఈ సబ్జెక్ట్ ఎంచుకున్నాం. సినిమాలో పాటలు, ఫైట్స్ వంటి కమర్షియల్ అంశాలు ఉంటేనే సరిపోదు సరైన కథ ఉండాలి.
మంచి స్క్రిప్ట్ కుదిరింది. దర్శకుడు రమేష్ అన్ని విధాలుగా ఆకట్టుకునే సినిమా రూపొందించాడు. ఈ కథకు పెద్ద హీరో అయితే బాగుంటుందని ప్రయత్నించాం కానీ ఎవరి డేట్స్ అందుబాటులో లేవు. కిరణ్ అబ్బవరం ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’తో పేరు తెచ్చుకున్నారు. ఆయనతో మూవీ ప్రారంభించాం. కిరణ్ ఏ పాత్రలోనైనా మెప్పించగల నటుడు. అతనిలో ైస్టెల్, ఈజ్, ఎనర్జీ ఉన్నాయి. దర్శకుడు ఈ క్యారెక్టర్ను ఎలా అనుకున్నాడో అంతే బాగా నటించాడు. కథను అన్ని హంగులతో నిర్మించాలంటే కొంత ఖర్చు అవుతుంది. ఈ సినిమాలో ‘ఛమక్ ఛమక్ పోరి’ అనే పాటకు భారీ సెట్ వేసి పిక్చరైజ్ చేశాం. నా గత చిత్రాలు ‘మత్తు వదలరా’, ‘హ్యాపీ బర్త్డే’కి కూడా అనుకున్న దానికంటే ఎక్కువే ఖర్చు చేశాం. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ చిత్రమవుతుంది. స్టార్ హీరోల సినిమాలను థియేటర్లోనే చూస్తారు. బాగుంటే చిన్న చిత్రాలకూ ఆదరణ దక్కుతున్నది. ప్రస్తుతం రితేష్ రానాతో ఓ సినిమా నిర్మిస్తున్నాం. మరో కొత్త దర్శకుడితో సినిమా ఉంటుంది.’ అన్నారు.