వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిపరమైన బాధ్యతలనూ రెండిటినీ సమానంగా ఎంజాయ్ చేస్తుంటారు నటి కియారా అద్వానీ. పెళ్లి, ప్రెగ్నెన్సీ, పేరెంట్హుడ్.. ఇలా జీవితంలో ఎన్ని కొత్త దశలు వచ్చినా ఆమె కెమెరాకు బ్రేక్ ఇవ్వకపోవడానికి కారణం అదే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని ఆసక్తికరమైన అంశాలను కియారా వెల్లడించారు. ‘మా అమ్మ టీచర్. నేనూ అమ్మలా టీచర్ కావాలనుకున్నా. కానీ నటిని అయ్యాను. డెస్టినీ అంటే అదే. నా అసలు పేరు ఆలియా. నేను ఇండస్ట్రీకి వచ్చేనాటికే అలియాభట్ పాపులర్. అందుకే పేరు మార్చుకోవాల్సి వచ్చింది. ‘అంజానా అంజానీ’ సినిమాలో ప్రియాంక చోప్రా పోషించిన ‘కియారా’ పాత్రంటే నాకెంతో ఇష్టం.
అందుకే ఆ పాత్ర పేరునే నా పేరుగా మార్చుకున్నా. ‘ఫగ్లీ’తో నా కెరీర్ మొదలైనా, ‘ఎంఎస్ ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ’ చిత్రం నా కెరీర్ని మలుపు తిప్పింది. అందులో నేను పోషించిన ‘సాక్షి’ పాత్ర నన్ను స్టార్ని చేసింది. కెరీర్ అనేది కొన్నాళ్లు కొనసాగాలంటే ఫిట్గా ఉండాలి. అందుకే వర్కవుట్లు బోరింగ్ అయినా తప్పడం లేదు. ఫిట్నెస్ కోసం కిక్ బాక్సింగ్ లాంటివి కూడా చేస్తాను. యాక్షన్ సినిమాలు చేసేటప్పుడు ఆ ట్రైనింగ్ ఉపయోగపడుతుంది. ఖాళీ సమయాల్లో ఇంట్లో కూర్చొని బొమ్మలు గీస్తుంటా. నా బ్యాగ్లో ఎప్పుడూ ఓ బుక్, స్కెచ్ పెన్స్, పెన్సిల్స్ ఉంటాయి. అలాగే ఆమెరికన్ సిరీస్, సైకలాజికల్ థ్రిల్లర్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తా’ అంటూ సరదాగా చెప్పుకొచ్చారు కియారా అద్వానీ.