కొత్త సంవత్సరంలో శుభవార్త వినిపించింది బాలీవుడ్ భామ కియారా అద్వాణీ. తన మనసు దోచిన చెలికాడు సిద్ధార్థ మల్హోత్రాతో కలిసి ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలిపింది. గత ఏడాది కాలంగా హీరో సిద్ధార్థ మల్హోత్రాతో కియారా అద్వాణీ ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ జంట వివాహానికి ఫిబ్రవరి 6న ముహూర్తం ఖరారైంది. రాజస్థాన్లోని జైసల్మార్ కోటలో వైభవంగా పెండ్లి వేడుకను నిర్వహించబోతున్నట్లు వారి సన్నిహితులు వెల్లడించారు. ఈ జంట వివాహానికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరవుతారని, ఇప్పటి నుంచే వివాహ ఏర్పాట్లకు సిద్ధమవుతున్నామని కియారా అద్వాణీ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ‘షేర్షా’ చిత్రంలో సిద్ధార్థ మల్హోత్రా, కియారా అద్వాణీ కలిసి నటించారు. అప్పుడే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.