పాన్ ఇండియా సంచలనం ‘కేజీఎఫ్ 2’ వసూళ్లలో చరిత్ర సృష్టిస్తున్నది. హోంబలే ఫిలింస్ పతాకంపై దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం తాజాగా ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల గ్రాస్ మార్క్ను చేరుకుంది. ఏప్రిల్ 14న రిలీజైన ఈ సినిమా కేవలం 16 రోజుల్లోనే 1006 కోట్ల రూపాయలు ఆర్జించింది. ‘దంగల్’, ‘బాహుబలి 2’, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఈ ఫీట్ చేసిన నాలుగో భారతీయ సినిమాగా నిలిచింది. కన్నడ చిత్రసీమలో వెయ్యి కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఏకైక చిత్రంగా అవతరించింది. బాలీవుడ్లో ఈ సినిమా దాదాపు 350 కోట్ల వసూళ్ల మార్క్ చేరుకోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నది. అక్కడ ‘దంగల్’, ‘బాహుబలి 2’ తర్వాత అత్యధిక కలెక్షన్స్ ఈ చిత్రానివే. ‘కేజీఎఫ్’ ఘన విజయంతో ఏర్పడిన క్రేజ్ ద్వితీయ భాగంతో రెట్టింపు అయ్యింది. ఈ సినిమా చివరలో ‘కేజీఎఫ్ 3’ ఉంటుందని సూచన చేశాడు దర్శకుడు. దీంతో ఈ సినిమా సంచలనాలు ఇంకా మిగిలే ఉన్నాయని తెలుస్తున్నది.