2023లో విడుదలైన ‘ది కేరళ స్టోరీ’ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రెండేళ్ల విరామం తర్వాత దానికి సీక్వెల్గా ‘ది కేరళ స్టోరీ 2’ చిత్రాన్ని కామాఖ్య నారాయణ్సింగ్ రూపొందించారు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 27న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇటీవలే టీజర్ని రిలీజ్ చేశాయగా, అందులో చూపించిన అంశాలు వివాదాలకు దారితీశాయి. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా సినిమా రూపొందించారంటూ కేరళ హైకోర్ట్లో ఈ సినిమాపై పిటీషన్ దాఖలైంది. మంగళవారం దీనిపై జరిగిన విచారణ అనంతరం కేరళ హైకోర్ట్ ఈ సినిమాపై కీలక వ్యాఖ్యలు చేసింది.
‘సాధారణంగా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ విషయంలో కోర్టు జోక్యం చేసుకోదు. కానీ ఈ సినిమా పేరులో ‘కేరళ’ అని రాష్ట్రం పేరును వాడారు. ఇది ఓ రాష్ట్ర ఆత్మాగౌరవానికి చెందిన విషయం కావడంతో విచారించక తప్పలేదు. సినిమాను వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించామని చెబుతున్నందున, కేరళ ప్రజల భయాందోళనలను విస్మరించలేం. ఓ వర్గాన్ని కానీ.. ప్రాంతాన్ని కానీ కించపరిచేలా కళారూపాలు ఉండకూడదు. చట్టపరమైన నిబంధనల ప్రకారం అభ్యంతకరమైన దృశ్యాలు కానీ, మాటల కానీ చేర్చకూడదు. అందుకే.. ఈ సినిమాను పూర్తిగా చూడాలనుకుంటున్నాం. ఈ నెల 25న ఈ సినిమాను కోర్టులో ప్రదర్శించాలి. తర్వాతే విడుదలపై నిర్ణయం తీసుకోగలం’ అని కోర్టు తెలిపింది.