స్టార్ హీరో హీరోయిన్లు ఉన్న సినిమాను నిర్మాతలు థియేట్రికల్ రిలీజ్ చేయడానికే ఇష్టపడతారు. కరోనా టైంలో ఓటీటీ రాజ్యమేలింది. కానీ ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. జనం హ్యాపీగా హాళ్లకు వెళ్లి సినిమా చూస్తూ వినోదం పొందుతున్నారు. అయితే కొందరు మేకర్స్ ఈ రూట్లో రిస్క్ చేయడం ఇష్టంలేకనో, మంచి ఆఫర్స్ కారణంగానో డిజిటల్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు ఇదే బాటను కీర్తి సురేశ్ పోలీస్ ఆఫీసర్గా నటించిన ‘సైరెన్’ ఎంచుకుంది.
చాలా రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉందీ చిత్రం. ‘పొన్నియన్ సెల్వన్’తో ప్రేక్షకులకు దగ్గరైన జయం రవి ద్విపాత్రాభినయం చేశారు. అనుపమా పరమేశ్వరన్ మరో హీరోయిన్గా చేసింది. ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వం వహించారు. సముద్రఖని, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ట్రైలర్ విడుదలతో ఈ చిత్రానికి క్రేజ్ బాగానే వచ్చింది.
తెలుగు వెర్షన్ కూడా డబ్బింగ్ అవుతోంది. ఇంత క్యాస్టింగ్ పెట్టుకొని ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేసేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారన్న విషయం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ చిత్రం జనవరి 26న జీ5 వేదికగా స్ట్రీమింగ్ కావొచ్చని తమిళనాట చెప్పుకొంటున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ పాత్ర భిన్న కోణాల్లో సాగుతుందని, పోలీస్ పాత్రలో ఆమె చేసే యాక్షన్ హంగామా మెప్పిస్తుందంటున్నారు.
ప్రస్తుతం కీర్తి సురేష్ తమిళంలో వరుస సినిమాల్లో నటిస్తున్నది. గత ఏడాది ‘దసరా’, ‘భోళా శంకర్’ వంటి బ్లాక్బస్టర్ హిట్స్ తర్వాత కూడా తెలుగులో ఇప్పటివరకు ఏ సినిమాను అంగీకరించలేదు. ఇదిలావుండగా.. ఈ అమ్మడు బాలీవుడ్ అరంగేట్ర చిత్రం ఆదివారం ప్రారంభమైంది. వరుణ్ధావన్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్నది.