Keerthy Suresh | ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుని భారతీయ సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ విడుదలై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ సినిమాలో అత్యంత ప్రత్యేకమైన పాత్రగా నిలిచిన ‘బుజ్జి’ గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. భైరవకు అత్యంత సన్నిహిత మిత్రుడిగా,ఏఐతో పనిచేసే స్మార్ట్ వాహనంగా కనిపించిన బుజ్జికి తన స్వరాన్ని అందించిన జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేశ్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.మలయాళ చిత్రం ‘గీతాంజలి’తో హీరోయిన్గా కెరీర్ ప్రారంభించిన కీర్తి సురేశ్, ‘నేను శైలజ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అనంతరం వరుస విజయాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఆమె, ‘మహానటి’ చిత్రంలో సావిత్రి పాత్రలో అద్భుత నటన కనబర్చి జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు.
నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన కీర్తి, ‘కల్కి 2898 ఏడీ’లో తెరపై కనిపించకపోయినా తన గాత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ దర్శకుడు నాగ్ అశ్విన్ మొదట తనకు సినిమాలో మరో ఆన్-స్క్రీన్ పాత్రను ఆఫర్ చేసినట్లు వెల్లడించారు. అయితే ఆ పాత్ర తనను అంతగా ఆకట్టుకోలేదని, అందుకే దానిని సున్నితంగా తిరస్కరించినట్లు తెలిపారు. నేను ఆ పాత్రను తిరస్కరించిన తర్వాత నాగ్ అశ్విన్ నాకు మెసేజ్ చేసి ‘కనీసం నా సినిమాలో ఒక గోడ చాటు నుంచి అయినా తొంగి చూస్తావా?’ అని అడిగారు. ఆయన సినిమాలో నేను ఏదో ఒక రూపంలో భాగమవుతానని నాకు నమ్మకం ఉండేది. ఇప్పుడు ఆ పాత్రను తిరస్కరించడం వల్లే బుజ్జి లాంటి ప్రత్యేక పాత్ర నాకు దక్కిందని అనిపిస్తోంది అని కీర్తి తెలిపారు. బుజ్జి పాత్ర గురించి తొలిసారి చెప్పినప్పుడు తాను కొంత ఆశ్చర్యపోయానని ఆమె వెల్లడించారు.
నాగి కేవలం మీ వాయిస్ మాత్రమే కావాలని చెప్పారు. షూటింగ్కు రావాల్సిన అవసరం లేదన్నారు. మొదట నాకు అది అర్థం కాలేదు. తర్వాత ఇది చాలా కొత్త కాన్సెప్ట్ అని అనిపించి వెంటనే అంగీకరించాను అని కీర్తి వివరించారు. సినిమాలో బుజ్జి పాత్రకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. హాలీవుడ్ చిత్రాల్లో కనిపించే ‘జార్విస్’ తరహాలో రూపొందించిన ఈ ఏఐ వాహనం భైరవకు నమ్మకమైన స్నేహితుడిగా కనిపించింది. మూడు చక్రాలతో రూపొందించిన ఈ స్మార్ట్ వెహికల్ కేవలం యాక్షన్ సన్నివేశాల్లోనే కాకుండా భావోద్వేగాలు, హాస్యంతో కూడిన సంభాషణల ద్వారా కూడా ప్రేక్షకులను అలరించింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం వంటి భాషల్లో కూడా కీర్తి స్వయంగా బుజ్జికి డబ్బింగ్ చెప్పడం విశేషం. ప్రతి భాషకు అనుగుణంగా తన స్వరంలో మార్పులు చేస్తూ ఆమె చూపిన ప్రతిభ ప్రేక్షకులను ఆకట్టుకుంది. భైరవ, బుజ్జి మధ్య వచ్చే సరదా సంభాషణలు థియేటర్లలో విశేష స్పందనను అందుకున్నాయి.