నటీనటులకు సినిమాలతో కేవలం వృత్తిపరమైన సంబంధమే కాదు..అంతకుమించి భావోద్వేగభరితమైన అనుబంధం కూడా ఉంటుంది. ఒక్క సినిమా కోసం కొన్ని నెలల పాటు పనిచేయడం వల్ల యూనిట్ సభ్యులతో చక్కటి స్నేహసంబంధాలు ఏర్పడతాయి. షూటింగ్ పూర్తయి గుమ్మడికాయ కొట్టే రోజున మనసంతా భారమైపోతుంది. ఇన్నాళ్లు కలిసి పనిచేసిన టీమ్కు దూరమైపోతున్నామని బాధపడతారు.
కథానాయిక కీర్తి సురేష్ ‘దసరా’ సినిమా షూటింగ్ చివరి రోజు అలాంటి భావోద్వేగానికే గురైందట. అయితే షూటింగ్ చివరి రోజున యూనిట్ సభ్యులందరికి బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చి వారిపై తన మనసులోని ప్రేమను చాటుకుందట కీర్తి సురేష్. మొత్తం 130 మంది యూనిట్ సభ్యులకు గోల్డ్ కాయిన్స్ బహుమతిగా అందించి తన గొప్ప మనసును చాటుకుందట.
ప్రస్తుతం ఈ విషయం సోషల్మీడియాలో ట్రెండ్ కావడంతో కీర్తి సురేష్ మనసు బంగారం అంటూ ఆమె అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో కూడా చాలా మంది నాయకానాయికలు ఇదే తరహాలో యూనిట్ సభ్యులకు విలువైన బహుమతులు అందించి తమ ఉదార స్వభావాన్ని చాటుకున్నారు.