చిత్రసీమలో కొన్ని కలయికలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. ఆ కాంబినేషన్ పునరావృతం అయితే చూడాలని అభిమానులు కోరుకుంటుంటారు. తమిళఅగ్ర హీరో విజయ్, కథానాయిక కీర్తిసురేష్ అలాంటి హిట్పెయిర్గా గుర్తింపును తెచ్చుకున్నారు. ‘భైరవ’ ‘సర్కార్’ చిత్రాల్లో ఈ జోడీ మెప్పించింది. ముచ్చటగా మూడోసారి ఈ జంట ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమవుతున్నారు. విజయ్ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత దిల్రాజు ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకుడు. ఈ సినిమాను ఇటీవలే ప్రకటించారు. డిసెంబర్లో సెట్స్మీదకు వెళ్లనుంది. ఇందులో కథానాయికగా కీర్తి సురేష్ను ఖరారు చేసే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలిసింది. ఈ దిశగా ఇప్పటికే చర్చలు జరిగాయని, అధికారికంగా ప్రకటించాల్సి ఉందని అంటున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తున్నది.