Actress | యువ నటి కయాదు లోహర్ తన స్కూల్ రోజుల్లో ఎదుర్కొన్న వేధింపుల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. పదో తరగతి చదువుతున్న సమయంలో కొందరు యువకుల వేధింపులను ఎదుర్కొన్నానని, ఒక దశలో సహనం కోల్పోయి ఆవేశంతో రాయి విసిరిన సంఘటన ఇప్పటికీ గుర్తుందని ఆమె చెప్పుకొచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కయాదు లోహర్, తాను పదో తరగతి చదువుతున్న రోజుల్లో ఇంటికి సమీపంలో ఉన్న ట్యూషన్కు వెళ్లేదాన్నని తెలిపారు. ఆ మార్గంలో ప్రతిరోజూ కొందరు అబ్బాయిలు తనను వేధించేవారని చెప్పారు. మొదటి రోజు వాటిని పట్టించుకోలేదని, రెండో రోజు కూడా మౌనంగానే వెళ్లిపోయానని, కానీ మూడో రోజు మాత్రం పరిస్థితి భరించలేకపోయానని ఆమె గుర్తు చేసుకున్నారు.
ఆ రోజు తీవ్ర కోపంతో రోడ్డుపై ఉన్న రాయిని తీసుకుని వారివైపు విసిరినట్లు కయాదు తెలిపారు. ఆ రాయి ఒక యువకుడి తలకు తగలడంతో అతడికి గాయమై రక్తస్రావం జరిగిందని చెప్పారు. ఆ ఘటన తర్వాత తాను అక్కడి నుంచి వెళ్లిపోయానని, తర్వాత ఏమైందో తనకు తెలియదని పేర్కొన్నారు. ఆ సమయంలో కోపం, భయం, నిస్సహాయత కలిసి తనను అలా స్పందించేలా చేశాయని వివరించారు. ఆ సంఘటనను ఇప్పుడు తిరిగి గుర్తు చేసుకుంటే, ఎవరినైనా గాయపరచడం సరైన పద్ధతి కాదని కయాదు అంగీకరించారు. హింస ఎప్పుడూ పరిష్కారం కాదని చెప్పిన ఆమె, అయితే అప్పటి పరిస్థితుల్లో తనకు ఎదురైన వేధింపులు, మానసిక ఒత్తిడి కారణంగానే అలా ప్రవర్తించాల్సి వచ్చిందని తెలిపారు.
సాధారణంగా తాను ప్రశాంత స్వభావం కలిగిన వ్యక్తినని, కానీ ఎవరైనా తప్పు చేస్తే దానిని మౌనంగా భరించడం కూడా సరికాదని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కయాదు లోహర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహిళలు, విద్యార్థినులు విద్యాసంస్థలకు లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో ఎదుర్కొనే వేధింపుల సమస్యపై మరోసారి చర్చ మొదలైంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలు మరింత బలోపేతం కావాలని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కయాదు లోహర్ పలు భాషల్లో వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆమె నటించిన ‘ఇధయమ్ మురళి’ జూలై 10న విడుదల కానుండగా, ‘ఇమ్మోర్టల్’ జూలై 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ‘ఐ యామ్ గేమ్’, ‘ఖలీఫా’, ‘ది ప్యారడైజ్’ వంటి చిత్రాలతో పాటు హీరో సూర్య నటిస్తున్న మరో చిత్రంలోనూ ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. న్నారు.