సినీరంగంలో కథానాయికల మధ్య పోటీ వాతావరణం కాస్త ఎక్కువగా ఉంటుంది. ప్రతీ ఏడాది కొత్త భామల ఆగమనంతో నాయికా రేసులో ఆప్షన్స్ పెరుగుతూ ఉంటాయి. ఏడాదిలో రెండుమూడు చిత్రాల్లో అవకాశం దక్కితే చాలనుకునే వారే ఎక్కువ. అలాంటిది అస్సామీ సోయగం కయాదు లోహర్ ప్రస్తుతం ఏడు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఐదేళ్ల క్రితం కన్నడ చిత్రం ‘ముగిల్పేటే’ ద్వారా దక్షిణాదిలో అరంగేట్రం చేసిన ఈ భామ అక్కడి నుంచి వెనక్కితిరిగి చూసుకునే అవకాశం రాలేదు. డ్రాగన్, పల్లిచట్టంబి వంటి హిట్ చిత్రాలు దక్షిణాదిలో ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏడు చిత్రాల్లో నటిస్తుండటం విశేషం.
అథర్వ మురళీతో కలిసి నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఇదయం మురళీ’ ఈ నెల 10న, సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘ఇమ్మోర్టల్’ ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకురాబోతున్నాయి. వీటితో పాటు ఈ సొగసరి దుల్కర్ సల్మాన్తో ‘ఆయామ్ గేమ్’, తెలుగులో ‘ది ప్యారడైజ్’, తమిళంలో మారిసెల్వరాజ్ దర్శకత్వంలో ‘మంజనాతి’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. సూర్య 48వ చిత్రంలో కూడా కయాదు లోహర్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ వరుస సినిమాలను బట్టి చూస్తే ప్రస్తుతం దక్షిణాదిలో అత్యధిక సినిమాలు చేస్తున్న నాయికగా కయాదు లోహర్ ప్రత్యేకంగా నిలుస్తున్నది.