ముంబై : పోలీసులపై దాడి చేయడంతో పాటు దుర్భాషలాడినందుకు టాలీవుడ్ హీరోయిన్ కావ్య తాపర్ను అరెస్టు చేసినట్లు జుహు పోలీసులు శుక్రవారం తెలిపారు. అంధేరి కోర్టులో హాజరుపరచగా.. కోర్టు నటిని జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం కావ్య తాపర్ మద్యం మత్తులో ఓ వ్యక్తిని కారుతో ఢీకొట్టి గాయపరిచింది. జుహులోని జేడబ్ల్యూ మారియట్ హోటల్ ఎదుట యాక్సిడెంట్ జరిగిందని జుహు పోలీస్ కంట్రోల్ రూమ్కు కాల్ వచ్చింది.
అనంతరం నిర్భయ స్క్వాడ్, పలు విభాగాలకు చెందిన పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో కావ్య అక్కడికి వచ్చిన మహిళా పోలీస్ అధికారిని దుర్భాషలాడడంతో పాటు ఆమె కాలర్ పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత అరెస్టు చేశామని, కోర్టులో హాజరుపరుచగా జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు వివరించారు. ఇదిలా ఉండగా.. కావ్య తాపర్ 2013లో తత్కాల్ షార్ట్ఫిలింతో సినీరంగ ప్రవేశం చేసింది. 2018లో ఈ మాయ పేరేమిటో చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మార్కెట్ రాజా ఎంబీబీఎస్ తమిళ చిత్రం, 2021లో వచ్చిన ఏక్ మినీ ప్రేమకథ చిత్రాల్లో హీరోయిన్గా నటించింది.