ముంబై : బాలీవుడ్ జంట కత్రినా కపుల్, విక్కీ కౌశల్ను చంపేస్తామని సోషల్ మీడియా వేదికగా బెదిరింపులు రావడంతో ముంబై పోలీసులు సోమవారం అజ్ఞాత వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోషల్ మీడియాలో బెదిరింపులపై విక్కీ కౌశల్ శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
గుర్తుతెలియని వ్యక్తి ఇన్స్టాగ్రాంలో బెదిరింపు మెసేజ్లను పోస్ట్ చేస్తున్నాడని ఫిర్యాదులో విక్కీ కౌశల్ పేర్కొన్నారు. కత్రినాను వెంబడిస్తూ ఆ వ్యక్తి ఆమెను కూడా బెదిరిస్తున్నాడని ఆరోపించారు. విక్కీ కౌశల్ ఫిర్యాదు ఆధారంగా కత్రినా దంపతులను బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ గత ఏడాది డిసెంబర్ 9న రాజస్ధాన్లో అట్టహాసంగా జరిగిన పెండ్లి వేడుకలో ఒక్కటయ్యారు.
ఇక టైగర్ ఫ్రాంచైజీలో భాగంగా సల్మాన్ ఖాన్ సరసన కత్రినా కైఫ్ టైగర్ 3లో కనిపించనున్నారు. టైగర్ 3తో పాటు భూత్, మెర్రీ క్రిస్మస్, జీలేజరా వంటి చిత్రాల్లో సందడి చేయనున్నారు. మరోవైపు విక్కీ కౌశల్ శాం బహదూర్, గోవింద నామ్ మేరా వంటి మూవీల్లో సిల్వర్ స్క్రీన్పై కనిపించనున్నారు.