బాలీవుడ్ క్యూట్ కపుల్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ ఎట్టకేలకు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. డిసెంబర్ 9న రాజస్థాన్లోని భర్వారా కోట సిక్స్సెన్సెస్ రిసార్ట్లో అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటు కొద్ది మంది బాలీవుడ్ ప్రముఖులు మాత్రమే ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. వివాహ ఘట్టంకి సంబంధించిన ఆనంద క్షణాలను కత్రినా కైఫ్ తన సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి వైరల్గా మారాయి.
పెళ్లి వేడుకలో కత్రినా కైఫ్ లెహంగాలో మెరవగా, ఈమె దుస్తులు అందరిని ఆకర్షించాయి. పంజాబీ థీమ్ దృష్టిలో పెట్టుకుని దీనిని డిజైన్ చేశారు. ప్రముఖ్ ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి డిజైన్ చేసిన ఈ లెహంగా స్పెషల్ ఏంటంటే దీనిని పూర్తిగా చేతితో అల్లారు. గోల్డెన్ థ్రేడ్ వర్క్తో ఎంబ్రాయిడరీ చేసి ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఎరుపు రంగు లెహంగా లో కత్రినా ఎంతో అందంగా కనిపించింది. ఈ లెహంగా అంచు కసం రివైవల్ జర్దోజీ వెల్వెట్లో ఎంబ్రాయిడరీ చేశారు. పంజాబీ టచ్ ఇస్తూ చేసిన ఈ లెహంగా.. సిల్వర్ వర్క్తో కస్టమ్ ట్రిమ్ చేయబడిన దుపట్టాపై గోల్డెన్ ఎలక్ట్రోప్లేటెడ్ డిజైన్ చేశారు.
కత్రినా తన పెళ్లికి సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ.. ‘ హృదయాల్లోని ప్రేమ, పరస్పర విశ్వాసం ఈ అందమైన క్షణాల వరకు మమ్మల్ని నడిపించింది . మేము ఇద్దరం కలిసి ఆరంభిస్తున్న ఈ సరికొత్త ప్రయాణానికి అందరి ఆశీర్వాదాలు, దీవెనలను కోరుతున్నాం’ అంటూ కామెంట్ పెట్టింది. ఈ కొత్త జంటకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు అందించారు. ప్రస్తుతం పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.