జూన్ 26న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన కత్తి మహేష్ దాదాపు పది రోజుల పాటు చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జూలై 10న కన్నుమూసారు. కత్తి మహేష్ మృతితో ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు,శ్రేయోభిలాషులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే ఎప్పుడు వివాదాలతో ఎక్కువగా వార్తలలో నిలిచే కత్తి మహేష్ పర్సనల్ విషయాల గురించి ఎవరికి పెద్దగా తెలియదు. సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించే సమయంలోనే బెంగాలీ అమ్మాయి సోనాలితో ప్రేమలో పడ్డారు కత్తి.
కొద్ది రోజుల తర్వాత సోనాలి, కత్తి మతాంతర వివాహం చేసుకోగా, వారికి కుమారుడు ఉన్నారు. ఇటీవల కుమారుడి బర్త్డే పురస్కరించుకొని నా కొడుకు అంటూ సోషల్ మీడియాలో ఆయన పరిచయం చేశారు. అయితే ఆదర్శ భావాలతో ముందుకు సాగుతున్న మహేష్ కొన్ని సంవత్సరాల క్రితం తన భార్య సోనాలి నుండి విడిపోయారు. ఆమె ప్రస్తుతం భోపాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. అయితే ఇప్పటికీ తన భార్యతో సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తున్న కత్తి బిగ్ బాస్ తర్వాత భోపాల్కి వెళ్లి తన భార్యని కలిసి హైదరాబాద్కి వచ్చాడట. కత్తి మహేష్ మరణ వార్త విని సోనాలికూడా భావోద్వేగానికి గురైందట.
కత్తి మహేష్ అంత్యక్రియలు చిత్తూరు జిల్లాలోని వాయల్పాడు సమీపంలోని తన స్వగ్రామంలో నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు. చెన్నై నుంచి కత్తి మహేష్ భౌతికకాయాన్ని నేరుగా తన స్వగ్రామానికి తరలించి.. ఆదివారం జూలై 11వ తేదీన అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.