కార్తిక్ ఆర్యన్..బాలీవుడ్లో ఓ మధ్యస్థాయి హీరో. విభిన్న కథా చిత్రాల్లో నటిస్తూ యువతలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గత ఏడాది వచ్చిన ‘భూల్ భూలయ్యా-2’ సినిమా భారీ విజయం కార్తిక్ ఆర్యన్ రేంజ్ను పెంచింది. తాజాగా ఈ యువహీరో పారితోషికానికి సంబంధించిన వార్తొకటి బాలీవుడ్లో హాట్టాపిక్గా మారింది. కరోనా పాండమిక్ సమయంలో తాను ఓ సినిమా కోసం 20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నానని, కేవలం పదిరోజుల్లోనే ఆ చిత్రాన్ని పూర్తి చేశారని కార్తిక్ ఆర్యన్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.
‘నిర్మాతలకు ఆ చిత్రం భారీ లాభాల్ని తెచ్చిపెట్టింది. హీరోగా నా స్థాయికి తగిన రెమ్యునరేషన్ తీసుకోవడం తప్పేమి కాదు. కెరీర్ ఆరంభం నుంచి కథాంశాల్లో వైవిధ్యానికి ప్రాధాన్యతనిస్తున్నా. అందుకే ప్రేక్షకుల్లో నాకు ఆదరణ పెరుగుతున్నది’ అంటూ చెప్పుకొచ్చారు కార్తిక్ ఆర్యన్. ప్రస్తుతం ఆయన ‘ఆషికి-3’, ‘షెహజాదా’ చిత్రాల్లో నటిస్తున్నారు.