హిట్టయిన సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుందంటే ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉంటాయి. అలాంటి అంచనాలతోనే నేడు విడుదలైన చిత్రం ‘కార్తికేయ-2’. 2014లో వచ్చిన కార్తికేయ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. కాగా దాదాపు 8ఏళ్ళ తర్వాత కార్తికేయ-2 తెరకెక్కింది. ట్రైలర్ బాగుండటం, కథా నేపథ్యం కొత్తగా అనిపించడంతో ఈ సినిమా చూడాలనే ఆసక్తి అందరిలో కలిగింది. ఆ నమ్మకాన్ని సినిమా ఏ మేరకు నిలబెట్టుకుందో రివ్యూలో చూద్దాం..
నటీనటులు – నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, శ్రీనివాస రెడ్డి, వైవా హర్ష, ఆదిత్య మీనన్ తదితరులు
సాంకేతిక నిపుణులు – సినిమాటోగ్రఫీ – కార్తీక్ ఘట్టంనేని, సంగీత – కాలభైరవ, నిర్మాతలు – అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్, రచన దర్శకత్వం – చందూ మొండేటి
కథేంటంటే:
శాస్త్రాన్ని నమ్మే వైద్యుడు కార్తికేయ (నిఖిల్). ఇతరుల నమ్మకాలనూ గౌరవిస్తాడు. సైకాలజీలో తనదైన ప్రయోగాలు చేస్తుంటాడు. మరోవైపు ప్రొఫెసర్ మిస్టర్ రావ్ శ్రీకృష్ణుడి కంకణం కోసం రీసెర్చ్ కొనసాగిస్తుంటాడు. ఈ కంకణానికి ప్రకృతి వైపరీత్యాలు, మహమ్మారుల నుంచి మానవాళిని కాపాడే శక్తి ఉంటుంది. ఇది లభిస్తే మానవజాతికి ఎలాంటి ప్రమాదాల నుంచైనా రక్షణ లభిస్తుంది. కలికాలంలో మానవులను కాపాడే శక్తి తన కాలి కంకణానికి ఉందని చెబుతూ శ్రీకృష్ణుడే స్వయంగా ఉద్ధవుడి ద్వారా ఇచ్చి పంపిస్తాడు. సరైన వ్యక్తి ద్వారానే దీన్ని కనుగొనగలరని చెబుతాడు. గతంలో పల్లవులు, ఛోళరాజులు వెతికినా దొరకని ఈ కంకణం కోసం పరిశోధనలు చేస్తుంటారు కొందరు శాస్త్రవేత్తలు. వారిలో ఈ కంకణాన్ని స్వార్థానికి వాడుకోవాలని చూస్తుంటాడు డాక్టర్ శంతను (ఆదిత్య మీనన్). అతని మాట వినలేదని మిస్టర్ రావ్ ను చంపాలని ప్రయత్నిస్తాడు. దైవ కంకణాన్ని కనుగొనే పనిని తన తర్వాత కొనసాగించే వ్యక్తి కార్తికేయ అని తెలుసుకున్న ప్రొఫెసర్ మిస్టర్ రావ్ తన చివరి ఘడియల్లో అతనికి తన మిషన్ గురించి అస్పష్టంగా చెబుతాడు. కార్తికేయకు మిస్టర్ రావ్ తన పరిశోధన రహస్యాలు చెప్పి ఉంటాడన్న అనుమానంతో కార్తికేయను పోలీస్ లతో అరెస్ట్ చేయిస్తాడు శంతను. మరోవైపు శ్రీకృష్ణుడి వస్తువులను ఎవరు దొంగిలించాలని చూసినా చంపేసే అభీరుడు కార్తికేయ వెంట పడతాడు. మిస్టర్ రావ్ మనవరాలు ముగ్ధ (అనుపమ పరమేశ్వరన్) కార్తికేయను చివరి నిమిషంలో కాపాడి పోలీస్ స్టేషన్ నుంచి బయటపడేలా సాయం చేస్తుంది. తాతయ్య తనకు అన్ని విషయాలు చెప్పాడని ముగ్ధ అంటుంది. దైవ కంకణం గురించి మిస్టర్ రావ్ కార్తికేయకు ఇచ్చిన వస్తువులేంటి, చెప్పిన క్లూస్ ఏంటి, వాటితో దైవ కంకణాన్ని కార్తికేయ ఎలా కనుగొన్నాడు. ఈ క్రమంలో శంతను, అభీరుడి ముప్పును కార్తికేయ ఎలా ఎదుర్కొన్నాడు అనేది మిగిలిన కథ
ఫ్లస్ పాయింట్స్:
నిఖిల్ నటన
గ్రాండ్ మేకింగ్
సినిమాటోగ్రఫీ
రచన దర్శకత్వం
మైనస్ పాయింట్స్:
సంగీతం
మూవీ టేకాఫ్
ఎలా ఉందంటే:
కార్తికేయ చిత్రంలో స్నేక్ హిప్నాటిజం అనే కొత్త పాయింట్ ను చూపించి ప్రేక్షకులను మెప్పించాడు దర్శకుడు చందూ మొండేటి. ఈ సారి శ్రీకృష్ణ తత్వాన్ని సీక్వెల్ సినిమాకు ఎంచుకున్నాడు. దీనికోసం అతను చాలా రీసెర్చ్ చేసినట్లు తెలుస్తున్నది. పురాణ ఇతిహాసాల్లో చెప్పిన ప్రతి అంశం శాస్త్రీయమైనదే నని బలంగా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. మన మునులు, రుషుల కంటే గొప్ప శాస్త్రజ్ఞులు లేరన్నాడు. మనం ఎలా బతకాలో శ్రీకృష్ణుడు చెప్పిన విధానాన్ని అనుపమ్ ఖేర్ ధన్వంతరీ పాత్ర ద్వారా చెప్పించాడు దర్శకుడు చందూ. ద్వారక, గ్రీస్, హిమాచల్ ప్రదేశ్ ..ఇలా దేశ విదేశీ లొకేషన్స్ లో ఈ సినిమాను చిత్రీకరించారు. ఈ లొకేషన్లు అన్నీ సినిమాకు అందాన్ని, గ్రాండియర్ ను తీసుకొచ్చాయి. టీమ్ చెప్పినట్లు ఇదొక సాహసయాత్రలా అనిపిస్తుంది. కార్తికేయగా నిఖిల్ నటన మరోసారి మెప్పించింది. ఎక్కడా క్యారెక్టర్ గీత దాటకుండా సెటిల్డ్ పర్మార్మెన్స్ చేశాడు నిఖిల్. ఆ పాత్రకు కావాల్సిన భావోద్వేగాలు, ఆర్థ్రత అతని అభినయంలో కనిపించాయి. ముగ్ధ పాత్రలో అనుపమ మెప్పించింది. ఆమె అందం, పాత్రలో నటించిన తీరు సినిమాకు ఆకర్షణ అయ్యాయి. శ్రీనివాస రెడ్డి, వైవా హర్ష పాత్రలు సినిమాలోని సీరియస్ నెస్ ను బ్యాలెన్స్ చేయాల్సిన హాస్యాన్ని అందించాయి. అభీరుడి పాత్ర భయంకరంగా, భీకరంగా సాగుతుంది. డాక్టర్ శంతనుగా ఆదిత్య మీనన్ విలనీ మెప్పించాడు. కాల భైరవ సంగీతంలో ఇంకా పరిణితి రావాలి. కృష్ణ తత్వమే సంగీత మయం. ఆ ఆహ్లాదాన్ని కాలభైరవ అందించలేకపోయాడు. కార్తీక్ ఘట్టంనేని సినిమాటోగ్రఫీ కథనం వెళ్లిన ప్రతి లొకేషన్ ను అందంగా చూపించింది. ఈ తరహా సినిమాలు తన బలం అని దర్శకుడు చందూ మొండేటి మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. దైవం, ఆధ్యాత్మికం, విశ్వంతో మనిషి మనుగడ ముడిపడిన తీరు దర్శకుడు బలంగా చెప్పగలిగాడు.
చివరగా – ఆకట్టుకునే సాహసయాత్ర
రేటింగ్ – 3.25/5