నిఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా ‘కార్తికేయ 2’. అనుపమా పరమేశ్వరన్ నాయికగా నటిస్తున్నది. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 13న విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా నిర్వహించిన కార్యక్రమంలో సినిమా విశేషాలను చిత్రబృందం తెలిపారు. దర్శకుడు చందూ మొండేటి మాట్లాడుతూ…‘ఒక కాన్సెప్ట్ను నమ్మి సినిమా చేశాం. మంచి చిత్రాన్ని రూపొందించామని భావిస్తున్నాం. సినిమా వర్క్ పూర్తయింది. ఇక దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. విభిన్నమైన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాం’ అన్నారు.
హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ మాట్లాడుతూ…‘ఈ సినిమా చిత్రీకరణ సమయంలో మాకొక సాహసయాత్రకు వెళ్లిన అనుభూతి కలిగింది. థియేటర్లో చూస్తున్నప్పుడు మీకూ అలాగే అనిపిస్తుందని చెప్పగలను. ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఆస్వాదించే కంటెంట్ సినిమాలో ఉంది’ అని చెప్పింది. హీరో నిఖిల్ మాట్లాడుతూ…‘థియేటర్ అనుభవాన్ని అందించే సినిమాలు చేస్తే ప్రేక్షకులు హాల్స్కు వచ్చి చూస్తారు. ఈ సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం డిజైన్ చేసిందే. రెండుసార్లు పాండమిక్ వల్ల ఇబ్బందులు పడ్డాం. అయినా అందమైన లొకేషన్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్, మంచి కాన్సెప్ట్తో సినిమాను రూపొందించాం. మా చిత్రబృందాన్ని నిర్మాతలు పూర్తిగా నమ్మి సపోర్ట్ చేశారు. బాగున్న సినిమాలు ఎప్పుడు విడుదలైనా ఆదరిస్తారని అనుకుంటున్నాం’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్, నటులు శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్, హర్ష తదితరులు పాల్గొన్నారు.