‘గతంలో నేను చేసిన పాత్రలన్నీ సీరియస్ మోడ్లో ఉండే పాత్రలే. తొలిసారి హ్యూమర్తో కూడిన పాత్ర చేశాను. ఇది నాకో కొత్త అనుభవం’ అన్నారు హీరో కార్తీక్ రత్నం. కేరాఫ్ కంచర్లపాలెం, నారప్ప చిత్రాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ రత్నం ‘ఛాంగురే బంగారురాజా’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈనెల 15న ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా ఆయన విలేకరులతో ముచ్చటించారు.
‘ఈ కథలోని ప్రతి పాత్రకూ ఓ మేనరిజం ఉంటుంది. అందులోంచే అద్భుతమైన కామెడీ పుడుతుంది. ఇందులో మెకానిక్గా కనిపిస్తా. ఓ ఇరవై కిలోమీటర్ల పరిధిలో నేనొక్కడ్నే మెకానిక్ని. దాంతో కస్టమర్లను ఆడుకుంటూ ఉంటా’ అని చెప్పారు కార్తీక్ రత్నం. చిన్నప్పట్నుంచీ రవితేజ వీరాభిమానిననీ, ఆయనతో ఒక్క ఫొటో దిగినా చాలు అనుకునేవాడ్ననీ, ఇప్పుడు ఆయన నిర్మించిన సినిమాలో హీరోగా చేయడం నిజంగా కలలా ఉందని ఆనందం వ్యక్తం చేశారు కార్తీక్ రత్నం. ఇంకా చెబుతూ ‘హీరోగా ఎదగాలనేది నా లక్ష్యం కాదు. నటుడిగా ఎదగాలి. అందుకే నచ్చిన ఏ పాత్రనయినా చేస్తాను. నేను రంగస్థల నటుడ్ని. పదేళ్ల వయసులోనే రంగస్థలం ఎక్కి ఉత్తమ నటుడిగా అవార్డు తీసుకున్నాను. ‘ఛాంగురే బంగారురాజా’ పెద్ద హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నాను. ఈ సినిమా తర్వాత ‘శ్రీరంగనీతులు’ అనే సినిమా చేశాను. అది కూడా త్వరలో విడుదల కానుంది. మిగిలిన సినిమాల వివరాలు త్వరలో చెబుతా’ అంటూ వివరించారు కార్తీక్ రత్నం.