Shehzada Movie Post poned | ఒక సినిమా విజయవంతగా ప్రదర్శితమవుతున్నప్పుడు ఇగోకు పోయి మరో సినిమాను రిలీజ్ చేస్తే కష్టాలు తప్పవని బాలీవుడ్కి గతేడాది రుజువైంది. ‘కేజీఎఫ్-2’ సంచలన విజయంతో దూసుకుపోతున్నప్పుడు షాహిద్ కపూర్ ‘జెర్సీ’ సినిమాను రిలీజ్ చేశాడు. కేజీఎఫ్-2 సునామీలో జెర్సీ కొట్టుకుపోయింది. సోలోగా వచ్చుంటే కనీసం బడ్జెట్ అయినా రికవరీ అయ్యిండేది. ఇగోకు పోయి కంటెంట్పై ఉన్న నమ్మకంతో జెర్సీను రిలీజ్ చేసి పోస్టర్ ఖర్చులను కూడా వెనక్కి తీసుకురాలేకపోయారు. ఇక అప్పుడు చేసిన తప్పు ఇప్పుడు చేయొద్దని ప్రొడ్యూసర్లు అమన్ గిల్, అల్లు అరవింద్ నిర్ణయించుకున్నాడు.
అమన్ గిల్, అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించిన లేటెస్ట్ మూవీ ‘షెహజాదా’. కార్తిక్ ఆర్యన్, కృతిసనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను రోహిత్ శెట్టి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తెలుగులో బ్లాక్బస్టర్ విజయం సాధించిన ‘అల వైకుంఠపురంలో’ సినిమాకు రీమేక్గా తెరకెక్కింది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కాగా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 10న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు. అయితే తాజాగా పఠాన్ సినిమా జోరు చూసి షెహజాదా చిత్రంబృందం వెనకడుగు వేసింది. ఇగోకు పోయి చేతులు కాల్చుకోవడం ఎందుకు అని ఈ సినిమాను వారం రోజులు పోస్ట్ పోన్ చేస్తూ కొత్త రిలీజ్ డేట్ను ప్రకటించింది.
ఈ సినిమాను ఫిబ్రవరి 17న విడుదల చేస్తున్నట్లు కొత్త డేట్ను వెల్లడించారు. ఇక ప్రస్తుతం పఠాన్ మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్పై దండయాత్ర చేస్తుంది. ఫస్ట్ వీకెండ్లోనే రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి.. హిందీ బెల్ట్పై సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. దాంతో ఈ సినిమా జోరు మరో రెండు వారాలు ఈజీగా కొనసాగుతుందని భావించి షెహజాదా చిత్రాన్ని వారం రోజులు పోస్ట్ పోన్ చేశారు.