Kareena Kapoor | విమాన ప్రయాణం సందర్భంగా ప్రముఖ బాలీవుడ్ నటి కరీనాకపూర్ అభిమానులతో ప్రవర్తించిన తీరు తనను ఆశ్చర్యానికి గురిచేసిందని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి మాట్లాడిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారింది. కొద్ది నెలల క్రితం ఓ టీవీ చర్చా కార్యక్రమంలో నారాయణ మూర్తి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కరీనా కపూర్ ప్రస్తావన తీసుకొస్తూ ‘నేను ఓసారి లండన్ నుంచి భారత్కు వస్తున్నాను. అదే ఫ్లైట్లో కరీనాకపూర్ ప్రయాణిస్తున్నది. ఆమెను చూసి చాలా మంది దగ్గరకు వచ్చి పలకరించారు. కానీ ఆమె మాత్రం వారిని అస్సలు పట్టించుకోలేదు. నా దగ్గరకు అలా ఎవరైనా వచ్చి పలకరిస్తే లేచి నిలబడి కనీసం ఒక నిమిషమైనా వారితో మాట్లాడతాను’ అని అన్నారు.
అప్పుడు పక్కనే ఉన్న నారాయణమూర్తి సతీమణి మధ్యలో కలుగజేసుకొని కరీనాకు మద్దతు తెలిపింది. ‘ఆ సమయంలో ఆమె అలసిపోయి ఉండొచ్చు. ఓ సాఫ్ట్వేర్ కంపెనీ వ్యవస్థాపకుడు అయిన మీకు ఓ పదివేల మంది అభిమానులు ఉంటారు కావొచ్చు. కానీ సినీ తారలకు కోట్లాది మంది ఫ్యాన్స్ ఉంటారు. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి’ అని సుధామూర్తి వ్యాఖ్యానించారు. ఆమె మాటలపై నారాయణమూర్తి స్పందిస్తూ ‘అభిమానులు ఎంత మంది అన్నది సమస్య కాదు. మనపట్ల ఎవరైనా ప్రేమను చూపించినప్పుడు వారికి ఏదో రూపంలో దానిని తిరిగివ్వాలి. అది చాలా ముఖ్యం. మనలోని అహాన్ని తగ్గించుకోవాలంటే ఇతరులకు గౌరవం ఇవ్వాలి’ అని పేర్కొన్నారు. ఓ డిజిటల్ క్రియేటర్ సంస్థ షేర్ చేసిన ఈ పాత వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది.