ముంబై : బాలీవుడ్ దిగ్గజ దర్శక నిర్మాత కరణ్ జోహార్ బర్త్డే పార్టీకి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మే 25న ముంబైలో కరణ్ జోహార్ 50వ బర్త్డే సందర్భంగా బాలీవుడ్ ప్రముఖులకు భారీ విందు ఏర్పాటు చేశారు. బర్త్డే పార్టీలో పాల్గొనే ప్రముఖులు, స్నేహితుల విందు కోసం సెలబ్రిటీ చెఫ్లను కరణ్ జోహార్ రంగంలోకి దింపారు.
యష్ రాజ్ స్టూడియోస్లో జరిగే బర్త్డే పార్టీలో మరుత్ సిక్కా, హర్ష కిలచంద్లు నోరూరించే వంటకాలను వండివార్చనున్నారు. హర్ష డెజర్ట్స్, కుకీస్, చాక్లెట్స్కు చేయితిరిగిన చెఫ్గా పేరొందగా, మరుత్ సిక్కా అవార్డు విన్నింగ్ రెస్టారెంట్లను ఏర్పాటు చేయడంతో వార్తల్లో నిలిచారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వంటి ప్రముఖులకు ఇష్టమైన వంటకాలను చేయడంలో ఆరితేరారు. మే 25న యష్రాజ్ స్టూడియోలో జరిగే కరణ్ జోహార్ బర్త్డే వేడుకల్లో ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లో పనిచేసిన డైరెక్టర్లతో పాటు రణ్బీర్కపూర్-అలియాభట్, రణ్వీర్సింగ్-దీపికా పడుకోన్ జంట ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.