ఇటీవల విడుదలైన కన్నడ చిత్రం ‘కాంతార’ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నది. డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్గా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతూ అన్ని భాషల్లో భారీ వసూళ్లను సొంతం చేసుకుంటున్నది. ఈ సినిమాలోని ‘వరాహరూపం దైవ వరిష్టం’ అనే పాట భక్తిభావాలతో ప్రేక్షకుల్ని తన్మయుల్ని చేస్తున్నది. తాజాగా ఈ పాట వివాదంలో చిక్కుకుంది. ఈ గీతాన్ని కాపీ కొట్టారంటూ కేరళకు చెందిన మ్యూజిక్బ్యాండ్ థాయికుడమ్ బ్రిడ్జ్ ఆరోపించింది. తమ బృందం రూపొందించిన ‘నవరసం’ అనే పాటను కాపీ కొట్టి ‘వరాహరూపం..’ పాటను కంపోజ్ చేశారని తెలిపింది.
తమ అనుమతి లేకుండా ట్యూన్ను వాడుకోవడం కాపీరైట్ చట్టాన్ని ఉల్లఘించడమేనని పేర్కొంది. ఈ మేరకు వారు ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ చేశారు. తమ బృందానికి మద్దతు ఇవ్వాల్సిందిగా నెటిజన్లను అభ్యర్థించారు. “వరాహరూపం..’ పాట విషయంలో మేము కోర్టుకు వెళతాం. పాటను స్ఫూర్తిగా తీసుకోవడం వేరు. కాపీ కొట్టడం వేరు. రెండింటి మధ్య చాలా తేడా ఉంది. కాపీ కొట్టడం ఖచ్చితంగా తప్పవుతుంది. ఈ విషయంలో మేము చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నాం’ అని థాయికుడమ్ బ్రిడ్జ్ బ్యాండ్ పేర్కొంది. అయితే ఈ ఆరోపణలపై ‘కాంతార’ చిత్రబృందం ఎలాంటి వివరణ ఇవ్వలేదు.