భారతీయ బాక్సాఫీస్ వద్ద తాజా సంచలనంగా మారిన కన్నడ మూవీ ‘కాంతార’ చిక్కుల్లో పడింది. రిషబ్ శెట్టి, సప్తమి గౌడ జంటగా నటించిన ఈ చిత్రంలో ‘వరాహ రూపం..’ పాట ప్రధాన ఆకర్షణ అయ్యింది. పతాక సన్నివేశాల్లో వచ్చే ఈ పాట సినిమాకు ప్రాణంగా మారింది. అయితే ఈ పాట విషయంలో కాపీ రైట్ వివాదం చుట్టుముట్టింది. తాము కంపోజ్ చేసిన ‘నవరసం..’ పాటను కాపీ చేసి ‘కాంతారా’ చిత్రంలో ‘వరాహ రూపం..’ పాటను స్వరపర్చారని కేరళ మ్యూజిక్ బ్యాండ్ థాయిక్కూడమ్ బ్రిడ్జ్ కోర్టుకెక్కింది. దీనిపై విచారణ జరిపిన కోజికోడ్ న్యాయస్థానం సినిమాలో వరాహరూపం పాటను థాయిక్కూడమ్ బ్రిడ్జ్ అనుమతి లేకుండా ప్రదర్శించకూడదని ఆదేశాలు జారీ చేసింది. సినిమాతో పాటు ఈ పాటను యూట్యూబ్, మ్యూజిక్ యాప్స్లోనూ ప్లే చేయొద్దంటూ ఆదేశించింది. ఈ విషయాన్ని థాయిక్కూడమ్ బ్రిడ్జ్ మ్యూజిక్ బ్యాండ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అడవినే నమ్ముకుని బతుకుతున్న ఓ గ్రామ ప్రజలకు అక్కడి భూస్వాములకు మధ్య జరిగే పోరాటంలో దైవం ఎలా సహాయపడింది అనే కథతో ఈ సినిమా తెరకెక్కింది.