Dileep Raj | కన్నడ చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, నిర్మాత దిలీప్ రాజ్ (47) బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో ఉన్న సమయంలో ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దిలీప్ రాజ్ మృతితో శాండల్వుడ్ దిగ్భ్రాంతికి గురైంది.
ఈ వార్త తెలుసుకున్న ‘కాంతార’ నటుడు రిషబ్ శెట్టి సోషల్ మీడియా వేదికగా దిలీప్ రాజ్కు నివాళులు అర్పించారు. “ఒక మంచి నటుడు, దర్శకుడు, నిర్మాత.. అన్నింటికీ మించి ఒక అద్భుతమైన మనిషి. మనం కలిసిన సందర్భాలు తక్కువైనా, మీ వ్యక్తిత్వం నా గుండెల్లో ఎప్పటికీ చెరగని ముద్ర వేసింది. మీ ఆత్మకు శాంతి చేకూరాలి” అంటూ రిషబ్ శెట్టి ఎమోషనల్ పోస్ట్ చేశారు.
దిలీప్ రాజ్ కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా కన్నడ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పునీత్ రాజ్కుమార్ నటించిన ‘మిలనా’ చిత్రంలో ఆయన పోషించిన ప్రతినాయకుడి పాత్ర ఆయన కెరీర్లోనే మైలురాయిగా నిలిచింది. ‘యు-టర్న్’, ‘బాయ్ఫ్రెండ్’ వంటి పలు విజయవంతమైన సినిమాలతో పాటు ‘హిట్లర్ కళ్యాణ’ వంటి పాపులర్ సీరియల్స్లోనూ ఆయన నటించారు. ఆయన మృతి పట్ల కన్నడ సినీ ప్రముఖులు మరియు అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.