ముంబయి : పరువు నష్టం కేసులో బాలీవుడ్ బ్రాండ్ కంగనా రనౌత్కు కష్టాలు తప్పడం లేదు. ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ముంబయి కోర్టు కంగనాపై కొరడా ఝుళిపించింది. కంగనా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా మేజిస్ట్రేట్ ఆర్ఆర్ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కంగనా సెలబ్రిటీ అయినందున ఆమెకు వృత్తిపరమైన పనులు ఉండొచ్చని.. కానీ ఆమె ఓ కేసులో నిందితురాలిగా ఉన్న విషయాన్ని మరచిపోకూడదన్నారు. ఈ మేరకు కంగనా దాఖలు చేసిన పిటిషన్ను తోసిపుచ్చారు.
ప్రముఖ ఆంగ్ల టీవీ చానెల్లో కార్యక్రమంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య సమయంలో.. బాలీవుడ్లో ఓ కోటరీ ఉందనీ, అందులో జావేద్ కూడా ఉన్నారని కంగనా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆయనపై పలు వ్యక్తిగత విమర్శలు కూడా చేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జావెద్ అక్తర్ కోర్టులో కేసు వేశారు. ఆ కేసులు ముంబయిలోని పదో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు విచారిస్తున్నది. ఈ క్రమంలో పలుమార్లు విచారణకు కంగనా హాజరుకాకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా రెండేసార్లు విచారణ కోసం కోర్టుకు హాజరైందని, ఆమె దేనికీ అతీతం కాదని న్యాయమూర్తి అన్నారు.
కేసు విచారణకు ప్రత్యక్ష హాజరు నుంచి మినహాయింపునివ్వాలన్న కంగన విజ్ఞప్తిని ఆయన తోసిపుచ్చారు. అసలు కేసు విచారణ ఎక్కడిదాకా వెళ్లిందని మినహాయింపునివ్వాలని అసహనం వ్యక్తం చేశారు. ఆమెపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇవ్వకుండా విచారణకు రాకుండా ఆమె తప్పించుకు తిరుగుతోందని, కావాలనే ఆమె ఎగ్గొడుతోందని మండిపడ్డారు. మినహాయింపు కావాలంటూ అప్పుడెప్పుడో కేసు విచారణ మొదలైనప్పుడు అడిగారని, అప్పట్నుంచి ఇప్పటిదాకా వాటిపై ఆదేశాలివ్వాలంటూ మాట్లాడుతున్నారే తప్ప.. అసలు కేసు విచారణకు మాత్రం సహకరించడం లేదని మేజిస్ట్రేట్ అన్నారు.
ఇప్పటిదాకా ఆమె చేసిన విజ్ఞప్తులన్నింటికీ కోర్టు ఒప్పుకొందని, ఇకపై ఒప్పుకొనే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గతంలో ఏనాడూ విచారణకు రాని కంగనకు ఇప్పుడు కోర్టు విచారణ హాజరుకు మినహాయింపునిస్తే ఇకపై తదుపరి విచారణల సందర్భంలో వివరాలిచ్చేందుకు అసలు రానేరాదని, కాబట్టి ఆమెకు మినహాయింపునిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ కేసు విచారణను ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేశారు.