నిత్యం వివాదాలతో సహవాసం చేస్తుంటుంది బాలీవుడ్ కథానాయిక కంగనా రనౌత్. హిందీ చిత్రసీమలో బంధుప్రీతి, అగ్ర సంస్థల ఆధిపత్య ధోరణిపై ఆమె గత కొంతకాలంగా నిరసన గళాన్ని వినిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ భామ అగ్ర హీరో అమీర్ఖాన్కు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చింది. ఇటీవల ముంబయిలో ప్రముఖ రచయిత శోభా డే రాసిన ఓ పుస్తకాన్ని అమీర్ఖాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన శోభా డే తన బయోపిక్లో ఎవరూ నటిస్తే బాగుంటుందో సూచించాలని అమీర్ఖాన్ను కోరింది. తన దృష్టిలో దీపికాపడుకోన్, ప్రియాంకచోప్రా, అలియాభట్ బెస్ట్ ఛాయిస్ అని అమీర్ఖాన్ చెప్పారు. ఈ ముగ్గురితో పాటు కంగనారనౌత్ కూడా తన పాత్రను పోషించడానికి అర్హురాలని, ‘తలైవి’ చిత్రంలో ఆమె నటన తనను ఎంతగానో ఆకట్టుకుందని శోభా డే పేర్కొంది.
అమీర్ఖాన్ సైతం కంగనారనౌత్ కూడా వైవిధ్యమైన నటి అంటూ కాస్త ఇబ్బందిగానే మెచ్చుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో తన పేరును ఉద్దేశ్యపూర్వకంగా అమీర్ఖాన్ విస్మరించారని కంగనారనౌత్ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయింది. ఆ కార్యక్రమం తాలూకు వీడియోను షేర్ చేస్తూ ‘నేను మూడుసార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న నటిని. పాపం..అమీర్ఖాన్ ఈ విషయం మర్చిపోయినట్లున్నాడు. ఆయన చెప్పిన ముగ్గురిలో ఒక్కరూ కూడా నేషనల్ అవార్డు తీసుకోలేదు..నా ప్రతిభను గుర్తించినందుకు శోభా డేకు కృతజ్ఞతలు’ అని కంగనారనౌత్ పేర్కొంది. ప్రస్తుతం ఆమె ట్వీట్ వైరల్గా మారింది.