బాలీవుడ్ తార కంగనా రనౌత్ నటించిన తాజా చిత్రం ‘ధాకద్’ భారీ ఫ్లాప్ దిశగా పయనిస్తున్నది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఏ వర్గం ప్రేక్షకులనూ ఆకట్టుకోలేక బాక్సాఫీస్ దగ్గర చతికిలపడింది. వారాంతపు వసూళ్లు కూడా మందగించడంతో చాలా థియేటర్లలో సినిమా ప్రదర్శనలు నిలిపివేశారు. ముంబైలో ఈ సినిమాకు ఒక్క షో పడలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ‘ఏ’ సర్టిఫికెట్ సినిమా కాబట్టి కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాకు రావడం లేదు. మిగతా ప్రేక్షకులకూ సినిమా రుచించక సినిమా థియేటర్వైపు అడుగువేయడం లేదు.
ఇప్పటిదాకా కేవలం 50 లక్షల రూపాయల వసూళ్లు మాత్రమే వచ్చాయని, మొత్తం రన్లో 3 కోట్ల రూపాయలకు సినిమా ఆదాయం మించదని ట్రేడ్ వర్గాలంటున్నాయి. ఈ లెక్కన 80 నుంచి 90 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ధాకద్ సినిమా నిర్మాతకు భారీ నష్టాలనే మిగిల్చేలా ఉంది. ఈ సినిమా శాటిలైట్, ఓటీటీ హక్కులు కూడా ఇంకా అమ్ముడుపోలేదట. సినిమా విడుదలయ్యాక సేల్ చేద్దాం అనుకున్న నిర్మాతలకు ఇప్పుడీ చేదు ఫలితంతో ముందు అనుకున్న ధర కూడా పలకడం లేదని తెలుస్తున్నది.