Kamal Haasan | ‘50ఏళ్ల క్రితం హైదరాబాద్కి టెక్నీషియన్గా వచ్చాను. మూడు జనరేషన్స్గా నన్ను ప్రేమిస్తూ, స్నేహిస్తూ ఇంతదూరం తెచ్చారు. మీ అందరికీ రుణపడి ఉంటాను. ‘భారతీయుడు’ ఇండియన్ సినిమాను మరోస్థాయిలో నిలబెట్టింది. ముఖ్యంగా తెలుగు వెర్షన్ పెద్ద హిట్. 28ఏళ్ల తర్వాత మళ్లీ ‘భారతీయుడు’ వస్తున్నాడంటే కారణం ఇంకా లంచగొండితనం ఉండబట్టే. ఇది అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. నేను ఈ సినిమాకి నటుడ్ని మాత్రమే కాదు. అభిమానిని కూడా. అంత అద్భుతంగా తీశాడు శంకర్. అలాగే ‘భారతీయుడు 3’ కూడా బావుంటుంది. మా ఆరేళ్ల కష్టాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. తెలుగు ప్రేక్షకులు నన్ను స్టార్ని చేశారు.
కె.బాలచందర్, కె.విశ్వనాథ్, శంకర్ లాంటి వాళ్లు సినిమాలు తీస్తే గొప్ప నటులు పుట్టుకొస్తారు.’ అని కమల్హాసన్ అన్నారు. ఆయన కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ప్రతిష్టాత్మక పాన్ఇండియా చిత్రం ‘భారతీయుడు 2’. ‘భారతీయుడు’ సీక్వెల్గా రూపొందిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించారు. ఈ నెల 12న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్లో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో కమల్హాసన్ మాట్లాడారు. ‘ ‘భారతీయుడు’ వచ్చి 28ఏళ్లయ్యింది. ఇన్నేళ్లల్లో ఎప్పుడు పేపర్ చూసినా, లంచం తీసుకున్నారన్న న్యూస్ కనబడితే ‘భారతీయుడు’ గుర్తొచ్చేవాడు. అందుకే సెకండ్ పార్ట్ చేయాలని నిర్ణయించుకున్నా. కథ రెడీ చేసుకొని, ‘రోబో 2.0’ టైమ్లో కమల్సార్కి వినిపించాను.
పాతికేళ్ల తర్వాత ఆయన ఆ గెటప్లో లొకేషన్స్కి వస్తుంటే గూజ్బమ్స్ వచ్చేశాయి. మనసులో తెలియని భక్తి, భయం. ఇండియాలో అలాంటి నటుడు లేడు. సిద్ధార్థ్ వంద సినిమాల అనుభవం ఉన్నట్టు నటించాడు. రకుల్ భాష తెలీకపోయినా సీన్ అర్థం చేసుకొని నటించింది. అందరూ బాగా చేశారు. ఇక ‘గేమ్చేంజర్’ విషయానికొస్తే.. రామ్చరణ్ పోర్షన్ పూర్తయింది. తనో తెలీని అద్భుతం. తన స్క్రీన్ప్రెజన్స్ గొప్పగా ఉంటుంది. అది రేపు అందరూ చూస్తారు’ అని దర్శకుడు శంకర్ తెలిపారు. ఇంకా సిద్ధార్థ్, నడిముడి వేణు, కాజల్, రకుల్ప్రీత్సింగ్, బ్రహ్మానందం, ఎస్.జె.సూర్య, సముద్రఖని, బాబీ సింహా, సుద్దాల అశోక్తేజ, రామజోగయ్యశాస్త్రి, కాసర్లశ్యామ్ కూడా మాట్లాడారు. ఏషియన్ సురేష్ మూవీస్, శ్రీలక్ష్మీ ప్రొడక్షన్స్ తెలుగులో విడుదల చేస్తున్నారు.