పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో చాలా బిజీగా ఉంటున్నారు. వకీల్ సాబ్ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ కొద్ది రోజులు భీమ్లా నాయక్, కొద్ది రోజులు హరిహర వీరమల్లు చిత్ర షూటింగ్స్ చేస్తూ బిజీ బిజీగా ఉండగా, ఈ మధ్య భీమ్లా నాయక్ షూటింగ్ కోసమే ఎక్కువ సమయం కేటాయించాడు. ఇప్పుడు ఆ చిత్ర షూటింగ్ పూర్తి కావొచ్చింది. దీంతో క్రిష్ సినిమాతో పాటు హరీష్ శంకర్ సినిమాల స్పీడ్ పెంచబోతున్నాడు.
నిన్న హరీష్ శంకర్, మైత్రిమూవీ మేకర్స్ని తన ఇంట్లో కలిసిన పవన్ ఈ రోజు క్రిష్, హరిహర వీరమల్లు చిత్ర నిర్మాత ఏఎమ్ రత్నం తో ముచ్చటించారు. చిత్రానికి సంబంధించి తదుపరి షెడ్యూల్ ఎప్పుడు మొదలు పెట్టాలా అనే దాని గురించి డిస్కస్ చేశారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29,2022న విడుదల చేయనున్నట్టు ఇటీవల బర్త్ డే పోస్టర్ విడుదల చేస్తూ తెలియజేశారు.
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు చిత్రంలో పవన్ కల్యాణ్ వజ్రాలదొంగ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో పవన్కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తోంది. అలాగే, ఔరంగజేబు పాత్రలో అర్జున్ రాంపాల్ నటించే అవకాశం ఉంది. కీరవాణి ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడెక్షన్స్ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది. మొఘల్ సామ్రాజ్యం పాలన బ్యాక్డ్రాప్లో రూపుదిద్దుకోనున్న ఈ సినిమాలో ఔరంగజేబు చెల్లెలి పాత్రలో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కనిపించనున్నారు.