‘ ఇందులో పిల్లల్ని తల్లిదండ్రులు ఎలా పెంచకూడదో చూపించాం. ఎలా పెంచితే పిల్లలు ఎలా తయారవుతారో చూపించాం. ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన సినిమా ఇది. థ్రిల్లర్, సస్పెన్స్ మాత్రమే కాకుండా అద్భుతమైన సెంటిమెంట్ కూడా ఈ సినిమాలో ఉంటుంది’ అని హీరో విశ్వ కార్తికేయ అన్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘కలియుగపట్టణంలో’. ఆయూషి పటేల్ కథానాయిక. రమాకాంత్రెడ్డి దర్శకుడు. డాక్టర్ కందుల చంద్రఓబుల్రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేశ్ నిర్మాతలు. ఈ నెల 29న చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో విశ్వకార్తికేయ విలేకరులతో ముచ్చటించారు. నంద్యాల నేపథ్యంలో ఈ కథ జరుగుతుందని, ప్రతి మనిషిలో ఉండే భిన్నమైన కోణాలను చూపించేలా ఈ సినిమా ఉంటుందని, ఇందులోని తన పాత్రలో విభిన్నమైన కోణాలుంటాయని, ఈ పాత్ర పోషణకోసం చాలా రీసెర్చ్ చేశానని విశ్వకార్తికేయ చెప్పారు. కథనాయిక ఆయూషి తెలుగు అమ్మాయి కావడం చేత తన పాత్రలోని భావాన్ని సులభంగా అర్థం చేసుకుందని, నా పాత్రతో సమానమైన ప్రాధాన్యత తన పాత్రకూ ఉంటుందని ఆయన అన్నారు. దర్శకుడు రమాంకాంత్రెడ్డి ఈ కథ చెప్పినప్పుడు కాసేపు అదే షాక్లో ఉండిపోయానని, స్క్రీన్ప్లేతో కట్టిపడేశాడనీ, టెక్నికల్గా సినిమా ఎంతో బావుంటుందనీ, పాటలు, ఆర్ఆర్, కెమెరా వర్క్ అన్నీ నెక్ట్స్ లెవల్లో ఉంటాయని విశ్వకార్తికేయ చెప్పారు. ఓ ఇండోనేషియా ప్రాజెక్ట్ చేస్తున్నాననీ, మంత్రతంత్రాలు, చేతబడుల నేపథ్యంలో సినిమా ఉంటుందని ఆయన తెలిపారు.