హైదరాబాద్ : భారత చలన చిత్ర పరిశ్రమలో విరబూసిన స్వర్ణకమలం కె.విశ్వనాథ్ అని హాస్యనటుడు బ్రహ్మానందం అన్నారు. కళాతపస్వి మృతికి ఆయన సంతాపం తెలిపారు. ‘విశ్వనాథ్ దర్శకత్వంలో నేను రెండు సినిమాల్లో నటించా. నేనంటే ఆయనకు ఎంతో అభిమానం. నెలరోజుల కిందటే కలిశా. పుట్టిన ప్రతి వాడూ చనిపోక తప్పదు. కానీ, అద్భుతమైన మరణాన్ని పొందిన కె.విశ్వనాథ్ కళ బతికున్నంత కాలం, కళాకారులు బతికున్నంత కాలం మనతోనే ఉంటారు. భారత చలన చిత్ర పరిశ్రమలో విరబూసిన స్వర్ణకమలం ఆయన’ అని అన్నారు.
‘విశ్వనాథ్.. తెలుగు దర్శకుడే కాదు, భారతీయ దర్శకుడు కూడా. యువతరానికి ఆయన ఆదర్శం. సినీ పరిశ్రమ పెద్దదిక్కును కోల్పోయింది’ – నాజర్
‘విశ్వనాథ్.. సమాజానికి ఉపయోగపడే గొప్ప చిత్రాలు తీశారు. బాపు, బాలచంద్ర, విశ్వనాథ్ వంటి వారు చరిత్రకారులు’ – రాఘవేంద్రరావు
ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్ గురువారం మృతి చెందిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత రాత్రి తుది శ్వాస విడిచారు. కళాతపస్వి మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. విశ్వనాథ్ మృతి వార్త తెలుసుకున్న సినీ లోకం.. ఆయనకు సంతాపం తెలిపుతోంది. సినీ, రాజకీయ ప్రముఖులు కళాతపస్వి భౌతిక కాయానికి నివాళులర్పిస్తున్నారు.