నిర్మాతగా రాణిస్తూనే మరోవైపు వినూత్న కథాంశాల్లో నటిస్తూ తన ప్రతిభను చాటుకుంటున్నది సీనియర్ కథానాయిక జ్యోతిక. ప్రస్తుతం ఆమె ‘కాథై’ అనే మలయాళ చిత్రంలో నటిస్తున్నది. ఇదిలావుండగా సుదీర్ఘ విరామం తర్వాత జ్యోతిక హిందీ చిత్రంలో కీలక పాత్రలో నటించనుంది. వివరాల్లోకి వెళితే.. ‘సాండ్ కీ ఆంఖ్’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకున్నారు దర్శకుడు తుషార్ హీరానందాని. ప్రస్తుతం ఆయన ఓ బయోపిక్కు సన్నాహాలు చేస్తున్నారు.
పుట్టుకతో అంధుడైనప్పటికీ వ్యాపారరంగంలో ఉన్నత స్థాయికి చేరిన తెలుగు వ్యక్తి శ్రీకాంత్ బొల్ల జీవిత కథ ఆధారంగా తుషార్ హీరానందాని ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ఇందులో రాజ్కుమార్ రావు కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో జ్యోతికను ఎంపిక చేశారు. కథాగమనంలో ఆమె పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని, స్ఫూర్తివంతమైన కథ కావడంతో జ్యోతిక ఈ సినిమాకు వెంటనే అంగీకరించారని అంటున్నారు. ఈ నెలాఖరులో ఈ సినిమా సెట్స్మీదకు రానుంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన శ్రీకాంత్ బొల్ల అంధత్వంతో బాధపడుతూనే అనేక అవాంతరాల్ని ఎదుర్కొని జీవితంలో సక్సెస్ అయ్యారు. అమెరికాలోని ప్రఖ్యాత మస్సాచ్యూట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రవేశం పొందిన తొలి అంధ విద్యార్థిగా ఆయన రికార్డు సృష్టించారు.