Puneeth Rajkumar | రాజ్కుమార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, తన నటన అభినయంతో కన్నడలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు పునీత్ రాజ్కుమార్. కన్నడిగులు ముద్దుగా అప్పు అంటూ పిలుచుకుంటుంటారు. సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన అనతికాలంలోనే పునీత్ అగ్ర హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కన్నడ నాట పవర్ స్టార్గా ఎదిగాడు. కేవలం నటుడిగానే కాకుండా, పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పరుచుకున్నాడు. అలాంటి సమయంలో గతేడాది అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. ఈయన మరణం సినీ పరిశ్రమను శోక సంద్రంలో ముంచింది. అప్పు మరణించి నేటికి ఏడాది పూర్తయింది. కాగా ఈయన చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి కర్ణాటక ప్రభుత్వం పునీత్కు కర్ణాటక రత్న అనే ప్రతిష్టాత్మకమైన బిరుదును ఇచ్చి గౌరవించింది.
కాగా కర్ణాటక ప్రభుత్వం వచ్చే నెల 1వ తేదీన బహిరంగ సభను ఏర్పాటు చేసి ఈ బిరుదును అధికారికంగా ప్రకటించనుంది. ఈ సభకు పునీత్ కుటుంబ సభ్యులతో పాటు పలు చిత్రపరిశ్రమలకు చెందిన అగ్ర సినీ తారలు హాజరు కానున్నారు. కాగా టాలీవుడ్ నుండి ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ హాజరు కానున్నాడు. తారక్- పునీత్ రాజ్కుమార్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న విషయం తెలిసిందే. పునీత్ రాజ్కుమార్ సినిమాలో ఎన్టీఆర్ ఓ పాటను కూడా ఆలిపించాడు. ఇక కోలీవుడ్ నుండి సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నాడు. వేల సంఖ్యలో అభిమానులు కూడా ఈ కార్యక్రమానికి వస్తారని భావిస్తున్నారు. అందుకోసమే కర్ణాటక ప్రభుత్వం ఈ సభను భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తుందట.