Jr.NTR Fans Arrested | తారక్ బర్త్డే సందర్భంగా మూడు రోజుల క్రితం కొందరు అభిమానుల అత్యుత్సాహం వారిని చిక్కుల్లో పడేసింది. ఎన్టీఆర్ పుట్టినరోజున సింహాద్రి రీ-రిలీజ్ అయిన విషయం తెలిసిందే. కాగా రీ-రిలీజ్ రోజున కృష్ణా జిల్లా మచిలీ పట్నంలోని సిరివెంకట్, సిరికృష్ణ అనే రెండు థియేటర్ వద్ద అభిమానులు రెండు మేకలను వేట కొడవళ్లతో నరికి వాటి రక్తాన్ని తారక్ ఫ్లెక్సీపై చిందించారు. దానికి సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అయ్యాయి.
దాంతో పోలీసులు ఆ ఘటనకు పాల్పడిన 9 మందిని అరెస్ట్ చేశాడు. మారణాయుధాలు వినియోగించి, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారంటూ కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇక సింహాద్రి రీ-రిలీజ్ రోజున తారక్ ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. యూకేలోని వెస్ట్ లండన్లో ఓ థియేటర్లో సింహాద్రి సినిమా ప్రదర్శితం అవుతుండగా క్రాకర్స్ పేల్చారు. దీంతో అవి కాస్తా తెరపై పడి.. దానికి మంటలు అంటుకున్నాయి. ఒక్క సారిగా మంటలు రావడంతో భయందోళనకు గురైన ప్రేక్షకులు బయటకు పరుగులు తీశారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి.