‘ఈ కథ నా దగ్గరకు వచ్చినప్పుడు ‘కొడితే పదిమంది కింద పడే కథ కాదు కదా? అనడిగాను. ఎంత గొప్ప ఫ్యామిలీ నుంచి వచ్చినా ఎవరి కష్టం వారు పడాలని ఎన్టీఆర్ ఓ సందర్భంలో అన్నారు. నార్నే నితిన్ కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు’ అన్నారు అగ్ర నిర్మాత అల్లు అరవింద్.
ఆయన సమర్పకుడిగా తెరకెక్కిన చిత్రం ‘ఆయ్’. ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి అంజి కే మణిపుత్ర దర్శకుడు. జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీవాసు, విద్యా కొప్పినీడు నిర్మించారు. నేడు ప్రేక్షకుల ముందుకొస్తున్నది. మంగళవారం హీరో నిఖిల్, శ్రీలీల ముఖ్య అతిధులుగా ప్రీరిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన హీరో నిఖిల్..సోషల్మీడియాతో పాటు బయట ఎక్కడ చూసినా ‘ఆయ్’ సందడే కనిపిస్తున్నదని, ఈ సినిమా బ్లాక్బస్టర్ హిట్ కావాలని ఆకాంక్షించారు. ‘ఈ కథ విన్నప్పుడు ‘జాతిరత్నాలు’ సినిమా గుర్తుకొచ్చింది. నార్నే నితిన్ అంకితభావంతో పనిచేశాడు’ అని నిర్మాత బన్నీ వాసు తెలిపారు. ఈ కథ విన్న తర్వాత అల్లు అరవింద్గారు ఫోన్ చేసి ఎంతగానో ఎంకరేజ్ చేశారని, ఈ ప్రపంచంలో కులాలు, మతాల కంటే స్నేహమే గొప్పదనే అంశాన్ని ఈ సినిమాలో చూపించామని హీరో నార్నే నితిన్ పేర్కొన్నారు.