‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ పురస్కారాన్ని అందుకునేందుకు అమెరికా లాస్ఎంజెలీస్ వెళ్లిన స్టార్ హీరో ఎన్టీఆర్ బుధవారం హైదరాబాద్ చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ వద్ద అభిమానులు సందడి చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ…‘ఆస్కార్ అవార్డ్ గెల్చుకోవడం మరుపురాని అనుభూతినిచ్చింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో భాగమైనందుకు గర్వపడుతున్నాను. భారతీయులంతా చూపించిన ప్రేమ వల్లే మేమీ పురస్కారం పొందగలిగాం. మా సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అభిమానం కురిపించారు. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు మా ప్రయత్నాన్ని ప్రోత్సహించారు. ఆస్కార్ వేదికపై సంగీత దర్శకుడు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ పురస్కారం అందుకున్న సందర్భాన్ని మర్చిపోలేను’ అని చెప్పారు. ప్రస్తుతం ఎన్టీఆర్ తన 30వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా…బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ నాయికగా నటిస్తున్నది. ఈ నెల 29 నుంచి ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుందని సమాచారం.