1980కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న రాజకీయ నేపథ్య చిత్రం ‘జితేందర్రెడ్డి’. రాకేష్ వర్రె ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి విరించి వర్మ దర్శకుడు. ముదుగంటి రవీందర్రెడ్డి నిర్మాత. త్వరలో సినిమా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ‘అ ఆ ఇ ఈ ఉ ఊ..’ అంటూ సాగే ఈ సినిమాలోని గీతాన్ని మేకర్స్ విడుదల చేశారు. రాంబాబు గోసాల రాసిన ఈ గీతాన్ని గోపీసుందర్ స్వరపరచగా, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు.
‘ 1980నాటి కాలంలో విద్యార్థి నాయకుడిగా, అన్యాయాలను ఎదుర్కొనే శక్తిగా ఎదిగిన జితేందర్రెడ్డి గురించి ఈ ప్రపంచానికి తెలియాలి. అందుకే అ సినిమా చేస్తున్నాం. వినోదం, సందేశం మిళితమైన గీతం ఇది. సినిమాలోని కీలక సన్నివేశంలో వచ్చే ఈ పాట సినిమాకు హైలైట్గా నిలుస్తుంది. కళాశాల ఎన్నికల్లో గ్రూపుల మధ్య ఏర్పడే కక్షల నేపథ్యాన్ని ఈ పాటలో చూపించాం. యువతరానికి బాగా నచ్చే సినిమా ఇది.’ అని నిర్మాత తెలిపారు. వైశాలి రాజ్, రియా సుమన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవిప్రకాశ్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: జ్ఞానశేఖర్.