వాస్తవ సంఘటనల ఆధారంగా తక్కువ బడ్జెట్లో రూపొంది, సంచలనంగా మారింది *ది కశ్మీరీ పైల్స్* చిత్రం. మార్చి 11న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకు కేంద్ర సర్కారు దగ్గరుండీ మరీ ప్రచారం చేసింది. కొన్ని రాష్ట్రాలు ఈ చిత్రానికి పన్ను మినహాయింపు ఇచ్చాయి. సినిమా చూసేందుకు ఉద్యోగులకు హాఫ్ డే లీవ్ కూడా ఇచ్చాయి. అయితే, తమ సినిమాకు కూడా ది కశ్మీరీ ఫైల్స్లాగా పన్ను మినహాయింపు ఎందుకు ఇవ్వరని ఝుండ్ సినిమా నిర్మాతల్లో ఒకరైన సవితా రాజ్ హిరేమఠ్ సోషల్మీడియా వేదికగా ప్రశ్నించారు.
ఝుండ్ సినిమా మార్చి 4న విడుదలైంది. ఇందులో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించారు. కాగా, తమ సినిమా కూడా ది కశ్మీరీ ఫైల్స్లాగా దేశభక్తి కోణంలో రూపొందించిన సినిమా అని సవితారాజ్ హిరేమఠ్ అన్నారు. ది కశ్మీరీ ఫైల్స్ సినిమాకంటే తమ సినిమా ఏం తక్కువ కాదన్నారు. దేశాభివృద్ధికి సంబంధించిన విషయం తమ సినిమాలో ఉందన్నారు. అసలు సినిమాలకు పన్ను మినహాయింపులు ఏ ప్రాతిపదికన ఇస్తారో తనకు తెలుసుకోవాలనుందని సవితారాజ్ హిరేమఠ్ పేర్కొన్నారు.