Jayam Movie | హిట్లు ఫ్లాప్లతో సంబంధంలేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటాడు యూత్ స్టార్ నితిన్. జయం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు నితిన్. కాగా మంగళవారంతో జయం చిత్రానికి ఇరవైఏళ్ళు. 2002 జూన్ 14న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ను సాధించింది. మొదటి సినిమాతో నితిన్కు మంచి క్రేజ్ వచ్చింది. అప్పటికే వరుస విజయాలతో స్పీడు మీదున్న తేజకు ఈ చిత్రం మరింత బూస్టప్ ఇచ్చింది. ఈ చిత్రంలో గోపిచంద్ విలనిజంకు గొప్ప ప్రశంసలు దక్కాయి. హీరోయిన్ సదా కూడా ఈ చిత్రంతోనే సినీరంగానికి పరిచయమైంది. కాగా జయం సినిమా ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా నితిన్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశాడు.
‘ఇరవై సంత్సరాల క్రీతం ఇదే రోజు నా మొదటి చిత్రం జయంతో సినీ ప్రయాణాన్ని ప్రారంభించాను. నాలోని నటుడిని గుర్తించి, నాకు మొదటి బ్రేక్ ఇచ్చిన తేజ గారికి హృదయపూర్వక ధన్వవాదాలు. ఇప్పటివరకు నేను చేసిన ప్రతి సినిమా దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, సిబ్బంది అందరికి ధన్యవాదాలు. మీరు లేకుండా నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉండేవాడ్ని కాదు. నా ప్రయాణంలో మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ నన్ను ఇంతగా ఆధరిస్తున్న నా అభిమానులకు ధన్యవాదాలు’ అంటూ ఎమోషనల్ నోట్ను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.
ఈ ఇరవై ఏళ్ళ సినీప్రయాణంలో నితిన్ ఎన్నో ఒడిదుడుకులను చూశాడు. విజయాలకంటే పరాజయాలే ఎక్కువగా వెనకేసుకున్నాడు. ‘జయం’ తర్వాత నితిన్ ‘దిల్’ చిత్రాన్ని చేశాడు. ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది. ఈ క్రమంలో రాజమౌళితో తన ఐదవ సినిమా ‘సై’ చిత్రాన్ని చేశాడు. ఈ చిత్రం నితిన్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. అద్భుతమైన ఆరంభం అందుకున్న నితిన్ దాన్ని కొనసాగించలేకపోయాడు. సై మూవీ తర్వాత ఏకంగా 12 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. 2012లో విడుదలైన ‘ఇష్క్’ వరకు నితిన్కు హిట్ లేదు.
ఇప్పుడున్న సమయంలో వరుసగా రెండు, మూడు ఫ్లాప్లు వస్తేనే హీరోలు కెరీర్ను కంటిన్యూ చేయలేకపోతున్నారు. అలాంటిది నితిన్ వరుసగా 12 సినిమాలు ఫ్లాప్ అయినా ఇండస్ట్రీలోనే కొనసాగాడంటే ఆయనకు సినిమాపైన ఎంత మక్కువో అర్థమవుతుంది. ప్రస్తుతం నితిన్ మాచర్ల నియోజకవర్గం అనే మాస్ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నాడు. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ లో సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత వక్కంతం వంశీతో ఓ సినిమా చేస్తున్నాడు.