Jawan Movie | హిందీ నటులలో దక్షిణాది ప్రేక్షకులు అమితంగా అభిమానించేది షారుఖ్ ఖాన్నే. ఆయన సినిమా రిలీజవుతుందంటే ఇక్కడ కూడా పెద్ద పెద్ద బ్యానర్లు, ఈలలు, గోలలతో థియేటర్లు మార్మోగిపోతుంటాయి. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో షారుఖ్ సినిమా రిలీజవుతుందంటే టాలీవుడ్ స్టార్ హీరో సినిమా రేంజ్లో సెలబ్రేషన్స్ జరుగుతుంటాయి. ఇక ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితుడైన అట్లీతో జవాన్ చేస్తుండటంతో ఈ సినిమాపై వీర లెవల్లో అంచనాలున్నాయి. ఈ సినిమా కేవలం సౌత్లోనే షారుఖ్కు రెండొందల కోట్ల బొమ్మ అవుతుందని ఇన్సైడ్ టాక్.
ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ గట్రా సినిమాపై ఓ రేంజ్లో హైప్ క్రియేట్ చేశాయి. అప్పుడే బాలీవుడ్ ట్రేడ్ షారుఖ్కు ఈ సినిమా మరో వెయ్యి కోట్ల బొమ్మవుతుందని అంచనా కూడా వేసేశారు. ప్రస్తుతం ఈ సినిమా ప్యాచ్ వర్క్ పూర్తి చేసుకుంటుంది. ఇదిలా ఉంటే మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్లను రిలీజ్ చేశారు. ఒక్క మాటలో ట్రైలర్ గురించి చెప్పాలంటే గూస్బంప్స్ అంతే. అట్లీ యాక్షన్ మార్క్ ట్రైలర్లో పుష్కలంగా కనిపిస్తుంది. తల్లికిచ్చిన మాట. నేరవేరని లక్ష్యం. ఈ రెండింటి కారణంగా ఓ మంచివ్యక్తి చెడ్డవాడిలాగా ఎందుకు మారాడు. నిజంగానే చెడ్డవాడిలా మారాడా? లేదంటే చెడ్డవాడిలా నటిస్తున్నాడా? ఒకవేళ నటిస్తే ఎందుకు నటిస్తున్నాడు అనే ఎన్నో ప్రశ్నలను ట్రైలర్ సంధిస్తుంది.
ట్రైలర్ ఆరంభం నుంచి ముగింపు వరకు ఒకటే యాక్షన్. బీ, సీ సెంటర్లలో ఎలాంటి మాస్ బొమ్మలు పడితే థియేటర్లు దద్దరిల్లుతాయో జవాన్ అచ్చం అలానే అనిపిస్తుంది. విజయ్ సేతుపతిని క్యారెక్టర్ను ఎక్కువగా రివీల్ చేయలేదు కానీ.. ఇన్సైడ్ టాక్ ప్రకారం ఆయన కెరీర్లో మరో బెస్ట్ రోల్ అవుతుందని అంటున్నారు. ఇక నయనతార కూడా యాక్షన్ మోడ్లో దుమ్మరేపింది. గెస్ట్ రోల్లో దీపికా పదుకునే బీస్ట్ అవతారంలో కనిపించింది. ముఖ్యంగా ట్రైలర్లో అనురుధ్ రవిచంద్రన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవల్లో ఉంది. మొత్తంగా ట్రైలర్ గూస్బంప్స్ తెప్పిస్తుంది. ఈ సారి షారుఖ్ ఎవిల్నెస్ను కూడా చూడబోతున్నట్లు స్పష్టం అయింది.
షారుఖ్ ఫ్యాన్స్ తడిగుడ్డ వేసుకుని పడుకోవచ్చు. బొమ్మ మాత్రం బ్లాక్బస్టర్ అని ట్రైలర్తో స్పష్టం అయిపోయింది. ఇక ఇప్పటికే ఈ సినిమా నాన్-థియేట్రికల్ హక్కులు రూ.250 కోట్ల రేంజ్లో బిజినెస్ చేశాయి. పైగా పఠాన్ వంటి ఇండస్ట్రీహిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో జవాన్పై అందరిలోనూ వీరలెవల్లో అంచనాలున్నాయి. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రెడ్ చిల్లీ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్ నిర్మిస్తుంది. షారుఖ్కు జోడీగా నయనతార నటిస్తుంది. హిందీతో పాటు పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది. అనురుధ్ రవిచంద్రన్ స్వరాలు అందిస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్ర పోషించాడు.